కార్లు వదలండి, సైకిల్ ప్రయాణాలు చేయండి : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2020-10-30T01:18:56+05:30 IST

కాలుష్య నియంత్రణకు ప్రజలు ముందుకు రావాలని సుప్రీంకోర్టు

కార్లు వదలండి, సైకిల్ ప్రయాణాలు చేయండి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : కాలుష్య నియంత్రణకు ప్రజలు ముందుకు రావాలని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. ‘‘సొగసైన కార్ల’’ను వదిలిపెట్టి, సైకిళ్ళపై ప్రయాణించాలని సలహా ఇచ్చింది. దేశ రాజధాని నగరం (ఎన్‌సీటీ) ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రతపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు ఈ సలహా ఇచ్చింది. 


భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడుతూ, వరి దుబ్బులను కాల్చడమే కాలుష్యానికి ఏకైక కారణం కాదని కొందరు నిపుణులు చెప్పారన్నారు. ‘‘మీ అందమైన కార్లను వాడటం మానేయాలి. ఆ పని మీరు చేయరు. మనమంతా బైక్స్‌పై వెళ్ళాలి - మోటార్ బైక్స్ కాదు, సైకిళ్ళు’’ అని తెలిపారు. కాలుష్యాన్ని సృష్టిస్తున్నది వరి దుబ్బుల కాల్చివేత మాత్రమే కాదని అనధికారికంగా కొందరు నిపుణులు చెప్పినట్లు తెలిపారు. ‘‘మీ సైకిళ్ళను బయటకు తీయవలసిన సమయమిది’’ అన్నారు. 


ఇదిలావుండగా, ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసిందని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ కాలుష్యం వల్ల ఎవరూ అస్వస్థులు కారాదని, ఒకవేళ ఎవరైనా అస్వస్థులైతే మిమ్మల్ని (ప్రభుత్వాన్ని) బాధ్యులను చేస్తామని పేర్కొంది. ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ నవంబరు 6న జరుగుతుంది.


Updated Date - 2020-10-30T01:18:56+05:30 IST