వైసీపీ నేతలపై చర్యలు తీసుకోండి: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-02-27T21:24:19+05:30 IST
టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు జరుపుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ
అమరావతి: టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు జరుపుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఆ పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, తదనంతర పరిణామాల్లో టీడీపీ సానుభూతిపరులపై ఓ వర్గం వారు, పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. బిక్కవోలు మండలం ఇల్లాపల్లి పంచాయతీలో సర్పంచ్గా గెలిచిన వైసీపీ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేయటంతో పాటు వారిపై తప్పుడు కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు.
పాలు తాగే బిడ్డ భయపడుతున్నందున ఇంటి ముందు టపాసులు కాల్చవద్దని టీడీపీ కార్యకర్త రాఘవ కోరినందుకు వైసీపీ నేతలు రాఘవ పైనా, అతని కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడ్డారని లేఖలో ఆయన పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టకుండా గాయపడిన బాధితులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆయన విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై కేసు నమోదయ్యేలా చూశారని ఆయన అన్నారు.
తమపై కేసు ఉపసంహరించుకోవాలంటూ బాధితులను పోలీసులు, వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత డీజీపీగా మీపై ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా డీజీపీ చూస్తారని ఆశిస్తున్నానని ఆ లేఖలో చంద్రబాబు తెలిపారు.