డబ్బులు డిమాండ్‌ చేసిన ఏఎస్‌ఐపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2022-09-25T06:50:47+05:30 IST

తన కుమార్తె మిస్సింగ్‌ కేసులో రూ.25వేలు డిమాండ్‌ చేసిన ఏఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని పాయకరావుపేటకు చెందిన షేక్‌మున్నీ అనే మహిళ అధికారులకు విజ్ఞప్తి చేసింది.

డబ్బులు డిమాండ్‌ చేసిన ఏఎస్‌ఐపై చర్యలు తీసుకోండి
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న మహిళలు


- తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఓ మహిళ ఆందోళన

పాయకరావుపేట, సెప్టెంబరు 24 : తన కుమార్తె మిస్సింగ్‌ కేసులో రూ.25వేలు డిమాండ్‌ చేసిన ఏఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని పాయకరావుపేటకు చెందిన షేక్‌మున్నీ అనే మహిళ అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో పలువురు మహిళలతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కుమార్తె  గత నెల 22వ తేదీ నుంచి కనిపించకపోవడంతో 23న పాయకరావుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని వివరించింది. ఫిర్యాదు తీసుకున్న ఏఎస్‌ఐ జె.గోవిందరావు కొద్ది రోజులు తమను పోలీస్‌ స్టేషన్‌కి తిప్పించుకున్న తరువాత రూ.25,000లు ఇస్తే ఒక్క రోజులో తమ కుమార్తెను తీసుకువచ్చి అప్పగిస్తామని చెప్పారని ఆరోపించింది.  లేకుంటే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమని, మరోమారు స్టేషన్‌కి వస్తే జైల్లో పెడతామన హెచ్చరించారని పేర్కొంది.  దీనిపై అధికారులు విచారణ చేపట్టి తమకు నాయ్యం చేయాలని కోరున్నట్టు చెప్పింది.  అనంతరం ఆమె  తహసీల్దార్‌ జయప్రకాష్‌కు వినతి పత్రం అందజేసింది. దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరగా, బాధితురాలు ఫిర్యాదుపై విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని పాయకరావుపేట సీఐను కోరినట్టు ఆయన తెలిపారు.


  


Updated Date - 2022-09-25T06:50:47+05:30 IST