తబ్లీగీ చీఫ్ మౌలానాపై కేసు
ABN , First Publish Date - 2020-04-09T07:13:52+05:30 IST
హజ్రత్ నిజాముద్దీన్ మర్కజ్లో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సమావేశం ఏర్పాటు చేయడంపై తబ్లీగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ సహా ఏడుగురు వ్యక్తులపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు...
- మొత్తం ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు
- మార్చి 24 సమావేశంపై సుమోటో కేసు
- సీఆర్పీసీ సెక్షన్ 19 కింద నోటీసులు
- క్వారంటైన్ అయ్యాక వస్తారు: అడ్వొకేట్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: హజ్రత్ నిజాముద్దీన్ మర్కజ్లో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సమావేశం ఏర్పాటు చేయడంపై తబ్లీగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ సహా ఏడుగురు వ్యక్తులపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్త లాక్డౌన్కు ముందే.. ఢిల్లీ సర్కారు నిషేధాజ్ఞలు విధించింది. ఈ నేపథ్యంలో మార్చి 24 మర్కజ్లో సమావేశానికి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమంటూ ఢిల్లీ పోలీసులు తబ్లీగీ చీఫ్కు అదే నెల 21న తేల్చిచెప్పారు.
దీంతో.. ‘‘పోలీసుల ఆదేశాలను లెక్కచేయొద్దు. లాక్డౌన్ను, భౌతిక దూరాన్ని పక్కన పెట్టి సమావేశానికి రండి’’ అంటూ మౌలానా ఆడియోను రికార్డ్చేసి, వాట్సా్పలో ప్రచారం చేశారు. మార్చి 24న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్ను ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చిన కాసేపటికే.. నిజాముద్దీన్ మర్కజ్లో 1,300 మందితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. మౌలానా ప్రస్తుతం హోంక్వారంటైన్లో ఉన్నారని, నిర్బంధం ముగిశాక దర్యాప్తునకు సహకరిస్తారని న్యాయవాది తౌసీ్ఫఖాన్ వెల్లడించారు. మరోవైపు.. కోవిడ్-19 కేసుల విషయంలో మతాలను, వ్యక్తులను కించపర్చొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది.