డిజిటల్ మార్కెటింగ్...న్యాయశాస్త్రంపై టీసాట్ ప్రసారాలు

ABN , First Publish Date - 2021-12-15T22:16:31+05:30 IST

మారుతున్న మార్కెటింగ్ పద్దతులకు అనుగుణంగా యువతలో వృత్తి నైపుణ్యం పెంచేందుకు డిజిటల్ మార్కెట్ పై ప్రత్యేక శిక్షణ పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు టి-సాట్ సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి తెలిపారు.

డిజిటల్ మార్కెటింగ్...న్యాయశాస్త్రంపై టీసాట్ ప్రసారాలు

హైదరాబాద్: మారుతున్న మార్కెటింగ్  పద్దతులకు అనుగుణంగా యువతలో వృత్తి  నైపుణ్యం పెంచేందుకు డిజిటల్ మార్కెట్ పై ప్రత్యేక శిక్షణ పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు టి-సాట్ సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి తెలిపారు. ప్రసారాల షెడ్యూలుకు సంబంధించిన వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు. టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లతో హైదరాబాద్ ఇక్ఫాయ్ యూనివర్సిటీ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డిజిటల్ మార్కెటింగ్, లా అవేర్ నెస్ పై ప్రత్యేక ప్రసారాలు అందించనున్నామని శైలేష్ రెడ్డి తెలిపారు.ఈ నెల 16వ తేదీ గురువారం నుండి ఇక్ఫాయ్ యూనివర్సిటీ లా, బిజినెస్ స్కూల్ అందించేడిజిటల్ మార్కెటింగ్, న్యాయశాస్త్రంలోని పలు ప్రత్యేక అంశాలపై అవగాహన ప్రసారాలుంటాయన్నారు. 


ఆధునిక పద్దతులకు అనుగుణంగా అందించే ప్రసారాలను యువత వినియోగించుకోవాలని సూచించారు. శని, ఆదివారాలు మినహాప్రతి రోజు ఉదయం నిపుణ ఛానల్ లో 9.30 నుండి 10 గంటల వరకు, విద్య ఛానల్ లో రాత్రి 9.30 నుండి 10.30 గంటల వరకు అనుభవం కలిగిన ఇక్ఫాయ్ యూనివర్సిటీ అధ్యాపక బృందం బోధించిన పాఠ్యాంశాలు ప్రసారమౌతాయన్నారు. ఇప్పటి వరకు పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన పాఠ్యాంశాలు అందించిన టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రస్తుతం యూనివర్సిటీ స్థాయి విద్యార్థులకు సైతం బోధన అందిస్తుందని వివరించారు. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి రావాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరువ చేసేందుకు ఐటి కమ్యూనికేషన్ల శాఖ పరిధిలోని టి-సాట్ నెట్వర్క్ తమ వంతు ప్రయత్నిస్తోందనిస్పష్టం చేశారు. 


ఇక్ఫాయ్ యూనివర్సిటీ సహకారంతో ప్రస్తుతం అందిస్తున్న డిటిటల్ మార్కెటింగ్, న్యాయశాస్త్రంలోని పలు అంశాలపై పాఠ్యాంశాలతో పాటు ఇతర విభాగాలపైనా పాఠ్యాంశ ప్రసారాలు కొనసాగనున్నాయని తెలిపారు. టి-సాట్ ఛానళ్లలో ప్రసారమైన పాఠ్యాంశాలు టి-సాట్ డిజిటల్ మీడియా వేదికలోనూ అందుబాటులో ఉంటాయని, తెలంగాణ యువత వీటిని వినియోగించుకొని ఉన్నత స్థాయి అవకాశాలు పొంది బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఈవో శైలేష్ రెడ్డి పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-12-15T22:16:31+05:30 IST