బుల్డోజర్ ద్వేషాన్ని ఆపండి : రాహుల్, ఒవైసీ

ABN , First Publish Date - 2022-04-20T17:24:50+05:30 IST

దేశ రాజధాని నగరంలోని జహంగీర్‌పురి ప్రాంతంలో చట్టవిరుద్ధ

బుల్డోజర్ ద్వేషాన్ని ఆపండి : రాహుల్, ఒవైసీ

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని జహంగీర్‌పురి ప్రాంతంలో చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించడం కోసం ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని ఆపాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, విద్వేషంతో కూడిన బుల్డోజర్స్‌ను ఆపాలని, పవర్ ప్లాంట్స్‌ను స్విచాన్ చేయాలని డిమాండ్ చేశారు. 


దేశంలో బొగ్గు కొరతను రాహుల్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో ప్రస్తావించారు. అత్యధిక ద్రవ్యోల్బణం, తీవ్రమైన నిరుద్యోగం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆరోపించారు. ఎనిమిదేళ్ళపాటు గొప్ప గొప్ప మాటలు చెప్పారని, ఇప్పుడు కేవలం ఎనిమిది రోజులకు సరిపడిన బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విద్యుత్తు కోతల వల్ల చిన్నతరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతింటాయని, ఫలితంగా ఉపాధి అవకాశాలను కోల్పోవలసి వస్తుందని చెప్పారు. విద్వేష బుల్డోజర్లను స్విచాఫ్ చేసి, పవర్ ప్లాంట్స్‌ను స్విచాన్ చేయాలని డిమాండ్ చేశారు. 


అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన ట్వీట్‌లో, బీజేపీ పేదలపై యుద్ధం ప్రకటించిందని ఆరోపించారు. ఆక్రమణల పేరుతో ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగానే ఢిల్లీలో కూడా ఇళ్ళను ధ్వంసం చేయాలని చూస్తోందన్నారు.  చట్టవిరుద్ధ ఆక్రమణల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వైఖరి అనుమానాస్పదంగా ఉందని మండిపడ్డారు. జహంగీర్ పురిలోని అక్రమ ఆక్రమణలను తొలగించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వంలోని పీడబ్ల్యూడీ శాఖ కూడా పాల్గొంటోందా? అని ప్రశ్నించారు. ఇలాంటి నమ్మక ద్రోహం చేస్తారని, పిరికితనంతో వ్యవహరిస్తారని ఆయనకు ఈ ప్రాంత ప్రజలు ఓటు వేశారా? అని ప్రశ్నించారు. ఆయన తరచూ పోలీసులులు తన నియంత్రణలో లేరని చెప్తున్నారని, ఈ సాకు ఇక్కడ పని చేయదని మండిపడ్డారు. ఈ విషయంలో చట్టబద్ధత, నైతికత ఎంత మాత్రం లేవన్నారు. నిస్సహాయ పరిస్థితులు ఉన్నాయన్నారు. 


ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ అధికారులు బుధవారం ఈ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కొన్ని ఆక్రమణలను తొలగించింది. ఈ నేపథ్యంలో ఈ చర్యలను నిలిపేయాలని కోరుతూ ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ, జహంగీర్ పురి ఏరియాలో అనధికారికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆక్రమణలను తొలగిస్తున్నారని ఆరోపించారు. దీంతో సుప్రీంకోర్టు స్పందిస్తూ, యథాతథ స్థితిని కొనసాగించాలని, తదుపరి విచారణ గురువారం జరుగుతుందని తెలిపింది. ఢిల్లీ హైకోర్టు కూడా బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ అంశంపై విచారణ జరిపేందుకు అంగీకరించింది.


Updated Date - 2022-04-20T17:24:50+05:30 IST