పంచాంగ కర్తలు అప్రమత్తంగా ఉండాలి: స్వామి స్వరూపానందేంద్ర

ABN , First Publish Date - 2020-10-11T21:59:23+05:30 IST

పండగల విషయంలో పంచాయతీ పెట్టడం కన్నా... భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను, ఉపద్రవాలను పసిగట్టి, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పంచాంగ కర్తలు దృష్టి సారించాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పిలుపునిచ్చారు.

పంచాంగ కర్తలు అప్రమత్తంగా ఉండాలి: స్వామి స్వరూపానందేంద్ర

విశాఖ: పండగల విషయంలో పంచాయతీ పెట్టడం కన్నా... భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను, ఉపద్రవాలను పసిగట్టి, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పంచాంగ కర్తలు దృష్టి సారించాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పిలుపునిచ్చారు. విశాఖ శారదా పీఠంలో అర్చక ట్రైనింగ్ అకాడమీ తరఫున నిర్వహించిన దైవజ్ఞ సమ్మేళనాన్ని ఉద్దేశించి స్వామి ప్రసంగించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో... మారుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, పంచాంగ కర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని స్వరూపానందేంద్ర సూచించారు. పండగలు అనేవి హిందువుల మనోభావాలకు సంబంధించినవి కనుక... వీటి విషయంలో విభేదాలను పక్కనపెట్టి, పంచాంగకర్తలు అందరూ ఏకతాటిపై నిలవాలని దిశానిర్దేశం చేశారు. పండగల విషయంలో అయోమయం నెలకొంటే, కరోనా కష్టాలతో ఇప్పటికే సతమతమవుతున్న భక్తులు... మరింత గందరగోళంలో పడే ప్రమాదముందని స్వామిజీ హెచ్చరించారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే శ్రీ ఫ్లవ నామ సంవత్సరానికి సంబంధించి పండగల విషయంలో పంచాంగకర్తలు అంతా ఏకాభిప్రాయంతో తమ పంచాంగాలను ప్రచురించాలని ఈ సదస్సులో పాల్గొన్న వారికి ఆయన స్పష్టం చేశారు.


పంచాంగ కర్తల మధ్య పండగల విషయంలో విభేదాలు ఉంటే, దాని ప్రభావం ప్రభుత్వాలతో పాటు... హిందూ  దేవాలయ  వ్యవస్థపై పడుతుందని స్వరూపానందేంద్ర స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది పండగల విషయంలో ఎలాంటి వివాదాలకు తావు లేని విధంగా ఈ దైవజ్ఞ సమ్మేళనంలో పాల్గొన్న  పంచాంగకర్తలు అంతా తీర్మానం చేయాలని స్వామీజీ  సూచించారు. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పంచాంగకర్తలు అందరితో పెద్ద ఎత్తున దైవజ్ఞ సమ్మేళనం నిర్వహించాలని సంకల్పించినట్లు స్వామిజీ వెల్లడించారు. ఈ దైవజ్ఞ సమ్మేళనంలో విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి  స్వాత్మానందేంద్ర స్వామి ఆశీస్సులు అందించారు. ఈ దైవజ్ఞ సమ్మేళనానికి దేవాదాయ శాఖ జాయింట్  కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వీరితో పాటు అర్చక ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ కృష్ణశర్మ, దేవాలయ పాలన సంస్థ డైరెక్టర్ ద్రోణంరాజు రామచంద్రరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-10-11T21:59:23+05:30 IST