టీటీడీకి బుద్ధిమాంద్యం వచ్చిందేమో!

ABN , First Publish Date - 2022-05-15T08:37:14+05:30 IST

టీటీడీకి బుద్ధిమాంద్యం వచ్చిందేమో!

టీటీడీకి బుద్ధిమాంద్యం వచ్చిందేమో!

పాలకమండలి తీరుపై స్వరూపానందేంద్ర అసంతృప్తి


తిరుపతి, మే 14(ఆంధ్రజ్యోతి): టీటీడీ పాలకమండలి పనితీరుపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పాలకమండలి పెద్దగా ధార్మిక కార్యక్రమాలు చేపట్టినట్టు దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడారు. టీటీడీ పాలకమండలికి బుద్ధిమాంద్యమో లేక కరోనా కారణమో తెలియదు కానీ నిస్తేజంగా ఉందని వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డిని ఉద్దేశించి.. ఆయన టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు అనేక ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారని, శారదా పీఠం కూడా ఆయనకు అండగా ఉండేదని గుర్తుచేశారు. కరుణాకర రెడ్డి లాంటి మరోవ్యక్తి టీటీడీ పాలకమండలికి రాబోరని కితాబిచ్చారు. తిరుపతిలో ఆదిశంకరాచార్య విగ్రహం ప్రతిష్ఠించాలని కరుణాకర రెడ్డిని కోరారు. శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర, మంత్రి కారుమూరు శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిరుమల శారదా పీఠానికి చేరుకున్న స్వరూపానందేంద్రకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

Updated Date - 2022-05-15T08:37:14+05:30 IST