దళిత గిరిజనుల కోసం శారదపీఠం తిరుమల యాత్ర
ABN , First Publish Date - 2021-03-29T22:23:47+05:30 IST
ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తామని శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు.
విశాఖ: ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తామని శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు. సోమవారం శారదా పీఠం ఆధ్వర్యంలో, సాత్మానంద సరస్వతి, 1200 మంది దళిత గిరిజనులను తిరుపతి దర్శనానికి తీసుకెళ్తున్న 25 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా స్వరూపానంద సరస్వతి మాట్లాడుతూ.. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సన్యాసం స్వీకరించిన తర్వాత బాలస్వామి తెలంగాణ రాష్ట్రంలో దిగ్విజయంగా యాత్ర చేశారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో మా యాత్రకు పట్టాభిషేకం చేశారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోనూ దిగ్విజయంగా యాత్ర పూర్తయిన సందర్భంలో అరకు పాడేరుకు చెందిన 1200 మంది దళిత గిరిజన సోదరులను తిరుపతి దర్శనానికి పంపుతున్నామని స్వరూపానంద సరస్వతి తెలిపారు. దేవాలయాల్లో అలజడులు జరుగుతున్నా శారదా పీఠం స్పందించలేదని.. గల్లీకి కూడా పనికిరాని కొంతమంది విమర్శలు చేస్తున్నారని స్వరూపానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడంలోనూ, అన్యమత ప్రచారాన్ని అడ్డుకట్టవేసేందుకు జీవో తీసుకురావడంలో శారదా పీఠం ఎంతో కృషి చేసిందని చెప్పారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా జరుగుతోన్న అవినీతిని సైతం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని స్వరూపానంద సరస్వతి స్పష్టం చేశారు.