గురుకుల విద్యార్థి మృతిపై అనుమానాలు
ABN , First Publish Date - 2022-05-17T05:15:12+05:30 IST
ఎన్టీపీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి హాస్టల్ భవనంపై నుంచి మహ్మద్ రవుఫ్(18) అనే విద్యార్థి పడి మృతిచెందిన ఘటనపై రగడ నెలకొన్నది.
- తెల్లవారే వరకు ఆసుపత్రిలోనే కాంగ్రెస్ నేత మక్కాన్సింగ్
- హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే మృతిచెందాడని ఆరోపణలు
- సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాల ఆందోళన
- అరెస్టు చేసిన పోలీసులు
గోదావరిఖని, మే 16: ఎన్టీపీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి హాస్టల్ భవనంపై నుంచి మహ్మద్ రవుఫ్(18) అనే విద్యార్థి పడి మృతిచెందిన ఘటనపై రగడ నెలకొన్నది. రవుఫ్ నుంచి బిల్డింగ్పై నుంచి ప్రమాదవశాత్తు పడ్డాడా లేక ఎవరైనా తోసివేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. భవనంపై నుంచి కింద ఉన్న ఇటుకలపై పడడంతో తలకు బలమైన గాయాలై అక్కకక్కడే మృతిచెందాడు. హాస్టల్ సిబ్బంది గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు మక్కాన్సింగ్ రాత్రి 12గంటల ప్రాంతంలో ఆసుపత్రికి చేరుకుని విద్యార్థి మృతి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. బంధువులు మృతిపై అనుమానాలున్నాయని చెప్పడంతో పోలీస్ అధికారులతో మాట్లాడారు. అప్పటికే అక్కడికి కుటుంబసభ్యులు, నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. హాస్టల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటి ద్వారా వివరాలు రాబడుతున్నామని ఎన్టీపీసీ ఎస్సై సర్ఫరాజ్ పేర్కొ న్నారు. తెల్లవారుజాము వరకు మక్కాన్సింగ్ అక్కడే ఉండి బంధువులతో మాట్లాడారు. సోమవారం ఉదయం పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఆసుపత్రికి విద్యార్థి సం ఘాల నాయకులు తరలివచ్చారు. రవుఫ్ మృతి పై విచారణ జరపాలంటూ రాజీవ్ రహదారిపై నాయకులు, విద్యార్థి బంధువులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాస్తారోకో చేస్తున్న నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తర లించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ నాయకులు మాట్లాడుతూ రవుఫ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని, మృతుని కుటుంబానికి రూ.50లక్షల నష్టపరిహారం, అతని తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, హాస్టల్ వార్డెన్, సిబ్బందిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. వన్టౌన్ సీఐ రమేష్బాబు, రామగుండం సీఐ లక్ష్మీనారాయణ ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ధర్నాలో కాంగ్రెస్ కార్పొరేటర్ ముస్తాఫా, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాజీమ్, ఎంచెర్ల మహేష్, ఏబీవీపీ నాయకులు అన్వేష్, అజయ్, ఎస్ఎఎఫ్ఐ నాయకులు ప్రవీణ్, సిద్ధార్థ, ఎన్ఎస్యూఐ నాయకులు ప్రసాద్, ఉద య్రాజ్, రోహిత్ పాల్గొన్నారు.
మృతిపై విచారణకు ఎమ్మెల్యే ఆదేశం
విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశించారు. సోమవారం ఆసుపత్రిలోని మార్చురీలో ఉన్న రవుఫ్ మృతదేహాన్ని పరిశీలించి, అతని కుటుంబసభ్యులను పరామర్శించి వివరా లు తెలుసుకున్నారు. హాస్టల్లో ఇలాంటి ఘటన జరగడం విచారకరమన్నారు.
మార్చురీకి తాళం వేసి పట్టుకెళ్లిన ఎస్సై
రవుఫ్ మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. అయితే ఎన్టీపీసీ ఎస్సై సర్ఫరాజ్ మార్చురీ గదికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. బంధువులు మార్చురీ వద్ద మృతదేహాన్ని చూసేందుకు వీలు లేకుండాపోయిం ది. ఉదయం 11గంటల వరకు మార్చురీ తలుపులను తెరవలేదు. దీంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి రవుఫ్ మృతిపై తల్లి మహ్మద్ అజీర ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ పోలీసులు అను మానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.