విజయభాస్కర్రెడ్డి సస్పెన్షన్ వంద శాతం తప్పిదమే...
ABN , First Publish Date - 2021-03-08T05:33:06+05:30 IST
ఏఎంసీ మాజీ చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వంద శాతం తప్పిదమేనని అందుకు క్షమాపణ చెబుతున్నానని ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ అన్నారు.
కొండేపాటి గంగాప్రసాద్
నాయుడుపేట, మార్చి 7 : ఏఎంసీ మాజీ చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వంద శాతం తప్పిదమేనని అందుకు క్షమాపణ చెబుతున్నానని ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ అన్నారు. నాయుడుపేటలో ఆదివారం రాత్రి విజయభాస్కర్రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన టీడీపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది స్వార్థం కోసం ఎదిగే నాయకుడిపై చర్య తీసుకున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు, పలువురు పార్టీ పెద్దలు విజయభాస్కర్రెడ్డి సేవలను అభినందించారన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అందరూ వదిలివేస్తే, చిత్తూరు, నెల్లూరుజిల్లాల్లో ఎక్కడా లేని విధంగా మున్సిపాలిటీలో 25 మంది అభ్యర్థులతో నామినేషన్లు వేయించారన్నారు. వ్యక్తిగతంగా ఆయన ఎదుగుదలను ఓర్చుకోలేక ఏ కొందరో చేసిన పనిమాత్రమే ఇదన్నారు. ఈ విషయం హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి తక్షణ న్యాయం చేస్తామన్నారు. విజయభాస్కర్రెడ్డి నిజాయితీ, దక్షత ప్రతి ఒక్కరికి తెలిసిందే అన్నారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన దేవస్థానాల మాజీ చైర్మన్ తానంకి నానాజీ, ఎన్డీసీసీబీ డైరెక్టర్ కలికి మాధవరెడ్డి, మాజీ చైర్పర్సన్ శోభారాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ సుధాకర్రెడ్డి, పూనాటి తిరుమలనాయుడు, దాసరి ప్రభాకర్నాయుడు, మాజీ కౌన్సిలర్ రేవతి, రాజేశఽ్వరమ్మ, తదితరులు ఉన్నారు.