కాలిఫోర్నియాలో భారతీయ కుటుంబం హత్య.. హంతకుడు మాజీ ఉద్యోగే..!
ABN , First Publish Date - 2022-10-08T01:24:13+05:30 IST
కాలిఫోర్నియాలో భారతీయ కుటుంబం(Indian family) దారుణ హత్యకు సంబంధించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఎన్నారై డెస్క్: కాలిఫోర్నియాలో భారతీయ కుటుంబం(Indian family) దారుణ హత్యకు సంబంధించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హంతకుడు మాన్యూయెల్ సాల్గాడో గతంలో వారి సంస్థలో పని చేసినట్టు మృతుల బంధువు ఒకరు తెలిపారు. పంజాబ్లోని హోష్యార్పూర్లోని హర్సీపిండి గ్రామానికి చెందిన జస్దీప్ సింగ్ (36), అతని భార్య జస్లీన్ కౌర్ (27) కాలిఫోర్నియాలో స్థిరపడిన విషయం తెలిసిందే. జస్దీప్ అక్కడ ఓ ట్రక్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. వీరందరినీ తుపాకీతో బెదిరించి అపహరించిన మాన్యుయేల్ ఆ తరువాత వారిని హత్య చేశాడు. భారతీయ కుటుంబం అపహరణకు గురైనట్టు తొలుత కేసు నమోదు చేసుకున్న పోలీసులకు చివరకు వారిని నిందితుడు హత్య చేసినట్టు గుర్తించారు.
జస్దీప్ దంపతుల బంధువు కథనం ప్రకారం.. జస్దీప్కు ఆ హంతుకుడి మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. హంతకుడు గతంలో అక్కడ ట్రక్కు డ్రైవర్గా పేనిచేసేవాడు. కానీ..కంపెనీతో అతడికి పొసగకపోవడంతో వెళ్లిపోయాడని చెప్పారు. అంతేకాకుండా.. ఏడాది క్రితం హంతకుడు జస్దీప్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఈమెయిల్స్ పంపినట్టు వారు తెలిపారు. ఇక నిందితుడు గతంలో ఓ దోపిడీ కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. 2015లో జైలు పాలైన అతడు ఆ తరువాత మూడేళ్లకు పెరోల్పై విడుదలయ్యాడు. నిషిద్ధ ప్రదార్థాలు వెంట తీసుకెళ్లిన మరో నేరంలోనూ అతడిపై కేసు నమోదైంది. కాగా.. జస్దీప్ కుటుంబం హత్య వార్తతో అతని స్వగ్రామమైన హర్సీపిండీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. జస్దీప్ కుటుంబం హత్య పట్ల హోష్యార్పూర్ ఎంపీ, కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.