సుశాంత్ మరణానికి ముందే తండ్రి ఫిర్యాదు.. క్లారిటీ ఇచ్చిన ముంబై డీసీపీ..
ABN , First Publish Date - 2020-08-06T02:55:12+05:30 IST
తన కుమారుడికి ప్రాణహాని ఉన్నట్టు ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేశానంటూ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి కేకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై..
ముంబై: తన కుమారుడికి ప్రాణహాని ఉన్నట్టు ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేశానంటూ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి కేకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై ముంబై పోలీసులు స్పందించారు. కేకే సింగ్ నుంచి తమకు ఈ వ్యవహారంపై రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ముంబై డీసీపీ పరమ్జిత్ ఎస్ దహియా పేర్కొన్నారు. ‘‘మిరండా అనే వ్యక్తిని పోలీసు కస్టడీలోకి తీసుకోవాలంటూ ఫిబ్రవరి 25న కేకే సింగ్ వాట్సాప్ సందేశం పెట్టారు. అయితే రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని నేను సుశాంత్ తండ్రికి స్పష్టంగా చెప్పాను. కానీ ఇంత వరకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదు..’’ అని డీసీపీ వెల్లడించారు.
కాగా తన కుమారుడి ప్రాణాలకు ముప్పు ఉందంటూ తాను ఫిబ్రవరి 25నే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాననీ.. అయినా పోలీసులు పట్టించుకోలేదని ఇటీవల కేకే సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. వాట్సాప్లో ముంబై డీసీపీ, తన కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన సంభాషణల స్క్రీన్ షాట్లను కూడా ఆయన విడుదల చేశారు. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సిఫారుల మేరకు సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచారణ చేపట్టేందుకు కేంద్రం ఇవాళ అంగీకరించింది.