కొత్త కలెక్టర్గా సూర్యకుమారి
ABN , First Publish Date - 2021-07-24T05:36:13+05:30 IST
విజయనగరం జిల్లా నూతన కలెక్టర్గా ఎ.సూర్యకుమారి నియమితులయ్యారు. కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్ బదిలీపై వెళుతున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటి వరకూ సూర్యకుమారి పౌర సరఫరాల శాఖ ఎమ్డీగా ఉన్నారు.
డాక్టర్ హరిజవహర్లాల్ బదిలీ
ఆర్అండ్ఆర్ కమిషనర్గా నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
విజయనగరం జిల్లా నూతన కలెక్టర్గా ఎ.సూర్యకుమారి నియమితులయ్యారు. కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్ బదిలీపై వెళుతున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటి వరకూ సూర్యకుమారి పౌర సరఫరాల శాఖ ఎమ్డీగా ఉన్నారు. హరిజవహర్లాల్ను ఆర్అండ్ఆర్ కమిషనర్గా నియమించారు. జిల్లాలో సుదీర్ఘ కాలం పనిచేసిన కొద్దిమంది కలెక్టర్లలో ఒకరిగా హరిజవహర్లాల్ గుర్తింపు పొందారు. ఆయన 2018 మే 17న కలెక్టర్గా విధుల్లో చేరారు. మూడు సంవత్సరాల రెండు నెలల పాటు పనిచేశారు. ముఖ్యంగా పరిశుభ్రతపై దృష్టి సారించారు. ఆరోగ్యం, పచ్చదనం పెంపొందించేందుకు ప్రాధాన్యమిచ్చారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ పనిచేశారు. సాధారణంగా కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన తరువాత అప్పటి వరకూ ఉన్న కలెక్టర్లు బదిలీ అవుతుంటారు. కానీ విజయనగరం జిల్లా విషయానికి వచ్చేసరికి హరిజవహర్లాల్ను కొనసాగించారు. అభివృద్ధి, పాలనాపరమైన అంశాల్లో చురుగ్గా వ్యవహరించారన్న పేరు ఆయనకు ఉంది. అదే సమయంలో కొన్ని అపవాదులను ఎదుర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే ఓ అవినీతి కేసును ఏకపక్షంగా కొట్టివేశారన్న ఆరోపణ ఉంది. ఇటీవల పూసపాటిరేగ హెచ్పీ గ్యాస్ గొడౌన్ కూల్చివేతలో కలెక్టర్ ప్రత్యేకంగా తహసీల్దార్కు సూచనలిచ్చిట్లు సమాచారం. చెరువుల అభివృద్ధిపై దృష్టిపెట్టినా..వాటి కబ్జా విషయంలో మెతక వైఖరి అవలంభించారన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ముఖ్యంగా దిగువ స్థాయి సిబ్బందిని అదుపు చేయలేకపోయారన్న అపవాదును ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చాలా ఏళ్ల తరువాత మహిళా కలెక్టర్గా సూర్యకుమారి నియమితులయ్యారు. గతంలో పూనం మాలకొండయ్య కలెక్టర్గా పనిచేశారు. అటు తరువాత ఇప్పుడు సూర్యకుమారి కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె 2008 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన వారు.