టీఆర్ఎస్ గెలిస్తే బతుకులు అధ్వానం
ABN , First Publish Date - 2021-03-08T08:26:15+05:30 IST
టీఆర్ఎస్ గెలిస్తే ఉద్యోగులు పీఆర్సీ, నిరుద్యోగులు నోటిఫికేషన్ల మాట మరచిపోవాల్సిందేనని.. ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగుల బతుకులు అధ్వానం గా మారుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
- మా పోరాటంతోనే పీఆర్సీపై కదలిక:
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్
- కేటీఆర్.. ‘వివక్ష’పై ఇంట్లో తేల్చుకో: కిషన్రెడ్డి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): టీఆర్ఎస్ గెలిస్తే ఉద్యోగులు పీఆర్సీ, నిరుద్యోగులు నోటిఫికేషన్ల మాట మరచిపోవాల్సిందేనని.. ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగుల బతుకులు అధ్వానం గా మారుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాచారం, రామంతాపూర్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. బీజేపీ పోరాటం చేసిన తర్వాతనే ఉద్యోగుల పీఆర్సీపై సీఎం కేసీఆర్ మాట్లాడారు తప్ప, అప్పటిదాకా నోరు మెదపలేదన్నారు. రాష్ట్రానికి 13 వేల కంపెనీలు తెచ్చామని, 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని.. ఇలా అనేక అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలుపొందాలని టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోందని.. కానీ ప్రజల అండదండలు, సర్వేలు బీజేపీకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే రెండు స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని, ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు జుర్రుకుంటన్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ డ్రామాలు సాగవని.. టీఆర్ఎ్సకు ఇక వీఆర్ఎస్ తప్పదని అన్నారు. మంత్రి కేటీఆర్పై ఆయన కుటుంబసభ్యులు వివక్ష చూపుతుంటే, కేంద్రాన్ని నిందించడం తగదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. కేంద్రం దక్షిణాది ప్రాంతాలపై వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. కేటీఆర్పై కుటుంబ సభ్యులకు వివక్ష ఉంటే ఆయన ఇంట్లో తేల్చుకోవాలన్నారు.
ఐటీఐఆర్కు ఎమ్మెల్సీ ఎన్నికలకు సబంధం లేదని చెప్పారు. ఉద్యోగులకు పదోన్నతులు, ఫిట్మెంట్ ఇవ్వడం చేతకాని ప్రభుత్వం వారిపై బెదిరింపులకు పాల్పడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్కు దమ్ముంటే ఉస్మానియా వర్సిటీలో ప్రచారం చేయాలని సవాల్ చేశారు. లిబియాలో గడాఫీకి పట్టిన గతి పడుతుందనే కేసీఆర్, కేటీఆర్ ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు వెళ్లడం లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గెలిస్తే, ఆరు నెలల్లో గులాబీ కండువా కప్పుకుంటాడని అన్నారు. నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిన టీఆర్ఎస్ సర్కారుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2014లో 7.3 ఉన్న పట్టభద్రుల నిరుద్యోగుల శాతం నేడు 27.7కు పెరిగిందని తెలిపారు. టీఆర్ఎస్ విధానాలతోనే నిరుద్యోగ సమస్య తీవ్రమైందన్నారు.