26,304 ఇళ్లలో సర్వే

ABN , First Publish Date - 2022-01-22T05:28:37+05:30 IST

26,304 ఇళ్లలో సర్వే

26,304 ఇళ్లలో సర్వే

  •  వికారాబాద్‌ జిల్లాలో జ్వర బాధితులు 1,250 మంది
  • 628 మందికి కొవిడ్‌ పరీక్షలు
  •  49 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ
  • హోం ఐసోలేషన్‌ కిట్ల పంపిణీ 

వికారాబాద్‌/మేడ్చల్‌, జనవరి21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఒమైక్రాన్‌, థర్డ్‌వేవ్‌ తీవ్రత పెరగడంతో ప్రభుత్వం మరోసారి ఇంటింటికీ ఫీవర్‌ సర్వేకు శ్రీకారం చుట్టింది. కరోనా మహమ్మారి ఉధృతి మరింత విజృంభించక ముందే ఇంటింటికీ వెళ్లి జ్వరం, దగ్గు, జలుబు వంటి అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి అవసరమైన మందులు పంపిణీ చేస్తోంది. కొవిడ్‌ అనుమానిత లక్షణాలు అధికంగా ఉన్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారిలో పాజిటివ్‌ సోకిన వారికి హోం ఐసోలేషన్‌ కిట్లు పంపిణీ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సర్వే బృందాలు వివరిస్తున్నాయి. జిల్లాలో  2,16,840 గృహాలు ఉండగా, ఆ గృహాల్లోని వారిని సర్వే నిర్వహించేందుకు 754 బృందాలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో 92, గ్రామీణ ప్రాంతాల్లో 662 బృందాలు సర్వేలో పాల్గొంటున్నాయి. ఒక్కో బృందంలో ఆశావర్కర్‌, ఏఎన్‌ఎం, మునిసిపల్‌/పంచాయతీ సిబ్బందిని నియమించారు. తొలిరోజు శుక్రవారం జిల్లాలో 26,304 గృహాల్లో సర్వే నిర్వహించగా, వారిలో 1250 మందికి కొవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అనుమానిత లక్షణాలు తీవ్రంగా ఉన్న 628 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 49 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించారు. వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొండగల్‌ నియోజకవర్గాల్లో  కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారికి సంబంఽధిత మందులు పంపిణీ చేశాయి. ఐదు రోజులు మందులు వాడినా అనారోగ్య లక్షణాలు తగ్గకపోతే  ఆసుపత్రికి  తరలించి అవసరమైన చికిత్స అందేలా చూడస్తామని వారికి వివరించారు. కాగా మేడ్చల్‌ జిల్లాలో 852 సర్వే  బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించాయి.  60,439 కుటుంబాల సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 1,983 మందికి జ్వరం ఉన్నట్లుగా గుర్తించారు. 1,898 మందికి మెడికల్‌ కిట్లను పంపిణి  చేశారు. 49 మందిని ఆస్పత్రుల్లో చేరాలని సూచించారు. 

Updated Date - 2022-01-22T05:28:37+05:30 IST