నేడు నగరానికి సీజేఐ
ABN , First Publish Date - 2022-04-23T13:41:16+05:30 IST
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శనివారం నగరానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒక్కరోజు పర్యటన కోసం సీజేఐ చెన్నై వస్తున్న సందర్భంగా
- పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా
- హైకోర్టులో 9 అంతస్తుల భవనానికి శంకుస్థాపన
- పలు కోర్టుల భవనాలు ప్రారంభం
- ‘ప్రపంచ తెలుగు సమాఖ్య’ వార్షికోత్సవానికి హాజరు
చెన్నై: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శనివారం నగరానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒక్కరోజు పర్యటన కోసం సీజేఐ చెన్నై వస్తున్న సందర్భంగా ఆయన వెళ్లే ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జస్టిస్ ఎన్వీ రమణతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎంఎం సుందరేశ్ తదితరులు కూడా రానున్నారు. ముందుగా వారు ఉదయం 11.15 గంటలకు మద్రాస్ హైకోర్టు ఆడిటోరియంలో జరుగనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో తొమ్మిదంతస్తులతో నిర్మించతలపెట్టిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కు సీజేఐ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నామక్కల్, విల్లుపురం జిల్లాల కోర్టు భవనాలు, న్యాయాధికారుల క్వార్టర్స్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల్లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్నాధ్ భండారీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎస్.రఘుపతి, అడ్వకేట్ జనరల్ ఆర్.షణ్ముగం, రిజిస్ట్రార్ జనరల్ పి.ధనపాల్, తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ చైర్మన్ పీఎస్ అమల్రాజ్ తదితరులు హాజరవుతారు.. వివిధ కారణాలతో మృతి చెందిన న్యాయవాదుల కుటుంబాలకు ఈ సందర్భంగా సీఎం సహాయాలు అందించనున్నారు.
ప్రపంచ తెలుగు సమాఖ్య వార్షికోత్సవంలో..
శనివారం సాయంత్రం 4 గంటలకు నుంగంబాక్కంలోని తాజ్ కోరమాండల్ హోటల్లో జరుగనున్న ప్రపంచ తెలుగు సమాఖ్య 29వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ, గౌరవ అతిథిగా మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్నాధ్ భండారీ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ వీఎల్ ఇందిరాదత్ స్వాగతం పలుకనుండగా, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏవీ శివరామ ప్రసాద్ వార్షిక నివేదిక సమర్పించనున్నారు.