ఇంజనీరింగ్‌ ఫీజులపై సుప్రీం షాక్‌!

ABN , First Publish Date - 2020-07-15T07:53:28+05:30 IST

ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది...

ఇంజనీరింగ్‌ ఫీజులపై సుప్రీం షాక్‌!

  • ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసులే అమలు చేయాలి
  • ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు పక్కకు

న్యూఢిల్లీ/అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి  దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) 2019-20, 2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.  ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడం కుదరదని స్పష్టం చేసింది. దీనిపై గత ఏడాది జూలై 23న ప్రభుత్వం జీవో నంబరు 38 విడుదల చేసింది. ఈ జీవోను ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు హైకోర్టులో సవాల్‌ చేశాయి. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఎం.గంగారావు జీవోను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.


ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసుల మేరకే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. అయితే... సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. అనంతరం సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో హైకోర్టు మార్పుచేసింది. 2018-19 విద్యా సంవత్సరపు ఫీజుకు, 2019 జూన్‌లో ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజుకు మధ్య ఉన్న తేడాలో 50 శాతాన్ని పాత ఫీజుకు కలిపి అమలు చేయాలని జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వును సవాల్‌ చేస్తూ 23 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. 2019-20 నుంచి మూడేళ్లకు ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలని కోరాయి. దీనిపై మంగళవారం జస్టిస్‌ నారిమన్‌, జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. గతంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణ రావు వాదనలువినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది మహ్‌పూజ్‌ నక్వీ విచారణకు హాజరయ్యారు.

Updated Date - 2020-07-15T07:53:28+05:30 IST