మాస్క్లు, శానిటైజర్ల బ్లాక్ మార్కెటింగ్పై పిల్, బుధవారం విచారణ
ABN , First Publish Date - 2020-04-01T01:13:06+05:30 IST
కరోనా వైరస్ వేధింపులు తీవ్రంగా ఉండటంతో ఫేస్ మాస్క్లు, శానిటైజర్లను స్వార్థపరులు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వేధింపులు తీవ్రంగా ఉండటంతో ఫేస్ మాస్క్లు, శానిటైజర్లను స్వార్థపరులు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అవసరమైనవారికి ఇవి అందుబాటులో ఉండటం లేదు. ఇదే విషయాన్ని ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరుపుతుంది.
జస్టిస్ ఫర్ రైట్స్ ఫౌండేషన్ (జేఎఫ్ఆర్ఎఫ్) ఈ పిల్ను దాఖలు చేసింది. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజులపాటు అష్ట దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు అవసరమైన ఫేస్ మాస్క్లు, శానిటైజర్లను నియంత్రిత ధరలకు అందుబాటులో ఉంచాలని పిటిషనర్ కోరారు. వీటిని అక్రమంగా దాచిపెట్టి, నిల్వ చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సర్జికల్/ఎన్95 మాస్క్లను న్యాయంగా అందరికీ అందుబాటులో ఉండేలా ప్రజా సంక్షేమం దృష్ట్యా తన కర్తవ్యాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా కోరారు.
మందుల దుకాణాలవారు ఈ మాస్క్లు, శానిటైజర్ల గరిష్ఠ చిల్లర ధరపై వారి సొంత చీటీలను అంటించి, అధిక మొత్తాలను వసూలు చేస్తున్నారని, అక్రమ లాభాలను ఆర్జిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.
ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరుపుతుంది.