'కన్వర్' యాత్రకు అనుమతిపై యోగి సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసు

ABN , First Publish Date - 2021-07-14T20:29:13+05:30 IST

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న భయాందోళనల మధ్య ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ..

'కన్వర్' యాత్రకు అనుమతిపై యోగి సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసు

న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న భయాందోళనల మధ్య ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'కన్వర్ యాత్ర'కు అనుమతి ఇవ్వడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. యాత్రకు అనుమతిస్తూ యోగి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. యాత్రకు ఎందుకు అనుమతించారో చెప్పాలని జస్టిస్ ఆర్‌.ఎఫ్.నారిమన్ సారథ్యంలోని ధర్మాసనం యూపీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.


కోవిడ్ థర్డ్ వేవ్‌ ముప్పు పొంచి ఉందంటూ వివిధ వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమయినప్పటికీ ఈనెల 25 నుంచి 'కన్వర్' యాత్ర ప్రారంభించేందుకు యోగి ప్రభుత్వం బుధవారంనాడు అనుమతి ఇచ్చింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా 'కన్వర్ యాత్ర'ను రద్దు చేసింది. కాంవడ్ యాత్ర అనేది సనాతన సంప్రదాయంలో ఒక భాగమైనప్పటికీ, కోవిడ్ మహమ్మారి సమయంలో విలువైన ప్రాణాలను కాపాడటం అత్యంత ముఖ్యమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వ్యాఖ్యానించారు.


ఉత్తరాఖండ్ ప్రభుత్వం కన్వర్ యాత్రను రద్దు చేసినప్పటికీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ యాత్ర కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తాపత్రికల్లో చదివామని, దీనిపై సంబంధిత ప్రభుత్వాల వైఖరిని తాము తెలుసుకోవాలని అనుకుంటున్నామని, ప్రజలను కలవరపెడుతున్న అంశం కావడంతో వారిలో అయోమయం నెలకొందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోవిడ్‌పై పోరాటంలో ఏమాత్రం మనం రాజీ పడకూడదని ప్రధాని మోదీ ఇప్పటికే వ్యాఖ్యానించడాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. జూలై 24న యాత్ర మొదలుకానున్నందున సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి నోటీసులు పంపుతున్నామని పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా స్పందన తెలియజేస్తే వచ్చే శుక్రవారం విచారణ జరుపుతామని బెంచ్ స్పష్టం చేసింది.

Updated Date - 2021-07-14T20:29:13+05:30 IST