మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు ప్రజాస్వామ్యానికి చేటు : సుప్రీంకోర్టు...

ABN , First Publish Date - 2022-01-12T02:49:58+05:30 IST

మహారాష్ట్ర శాసన సభ 2021 జూలైలో భారతీయ జనతా పార్టీకి చెందిన

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు ప్రజాస్వామ్యానికి చేటు : సుప్రీంకోర్టు...

న్యూఢిల్లీ : మహారాష్ట్ర శాసన సభ 2021 జూలైలో భారతీయ జనతా పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఓ ఏడాదిపాటు సస్పెండ్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ చర్య ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. శాసన సభకు రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని పేర్కొంది. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే సభ్యుని పదవికి ఏర్పడే ఖాళీని భర్తీ చేయవలసిన చట్టబద్ధ బాధ్యత ఉందని, ఆరు నెలల్లోగా భర్తీ చేయడం సమంజసమని, అంతకు మించి అయితే రాజ్యాంగ విరుద్ధమవుతుందని తెలిపింది. జస్టిస్ ఏఎం కన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 


తమను ఓ ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర శాసన సభ 2021 జూలై 5న చేసిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ 12 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా మంగళవారం అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సభ్యుడిని సస్పెండ్ చేసే అధికారం సభకు ఉందనే వాదనతో ఏకీభవించినప్పటికీ, ఓ సంవత్సరంపాటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం లేకుండా, ఖాళీగా ఉంచడం ద్వారా రాజ్యాంగపరమైన శూన్యతను సృష్టించకూడదని ధర్మాసనం తెలిపింది. 


ఈ ఎమ్మెల్యేలు సభలో తప్పుగా ప్రవర్తించారని, ప్రిసైడింగ్ ఆఫీసర్ భాస్కర్ జాదవ్‌పై దుర్భాషలాడారని ఆరోపిస్తూ శాసన సభ ఈ తీర్మానం చేసింది. 


Updated Date - 2022-01-12T02:49:58+05:30 IST