వాహన కంపెనీలకు గుడ్ న్యూస్ చెప్పిన సుప్రీంకోర్టు
ABN , First Publish Date - 2020-03-27T23:11:39+05:30 IST
వాహన కంపెనీలకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. బీఎస్-4 వాహనాల విక్రయాలకు ఈ నెల
న్యూఢిల్లీ: వాహన కంపెనీలకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. బీఎస్-4 వాహనాల విక్రయాలకు ఈ నెల 31 వరకు విధించిన గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. దీంతో ఆటోమేకర్స్ ఊపిరి పీల్చుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మిగిలి ఉన్న స్టాక్లో 10 శాతాన్ని పది రోజుల్లోపు అమ్ముకునేలా జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది. అయితే, ఇది ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియన్కు వర్తించదని పేర్కొంది. అంతేకాదు, బీఎస్-4 వాహనాలను కొనుగోలు చేసిన పది రోజుల్లోనే రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. అయితే, మార్చి 31కి ముందు కొనుగోలు చేసిన వారు మాత్రం తర్వాతైనా చేసుకోవచ్చని పేర్కొంది.
బీఎస్-4 వాహనాలను విక్రయించేందుకు ప్రస్తుతం ఉన్న మార్చి 31 గడువును మరో రెండు నెలలు పొడిగించాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు వారికి ఊరటనిచ్చే తీర్పు చెప్పింది.