ముంబై పేలుళ్ల దోషి విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2020-11-29T19:55:18+05:30 IST

నేరం జరిగిన సమయంలో తాను మైనర్‌నని, తనపై కనికరం

ముంబై పేలుళ్ల దోషి విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : నేరం జరిగిన సమయంలో తాను మైనర్‌నని, తనపై కనికరం చూపాలని 1993 ముంబై పేలుళ్ళ కేసులో దోషి చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముహమ్మద్ మొయిన్ ఫరీదుల్లా చేసిన దరఖాస్తును తిరస్కరించింది. తీర్పును రద్దు చేయడానికి వీలుకానటువంటి దశకు చేరుకున్న తర్వాత రాజ్యాంగంలోని అధికరణ 32 ప్రకారం పిటిషన్ దాఖలు చేసి, సవాలు చేయరాదని స్పష్టం చేసింది. 


టెర్రరిస్ట్ అండ్ డిస్‌రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (టాడా)  ప్రకారం డిజిగ్నేటెడ్ కోర్టు విధించిన శిక్షను సవరించాలంటే సుప్రీంకోర్టు తప్పనిసరిగా రాజ్యాంగంలోని అధికరణ 32 ప్రకారం లభించిన అధికారాలను వినియోగించవలసి ఉంటుందని తెలిపింది. డిజిగ్నేటెడ్ కోర్టు ఇచ్చిన తీర్పును, విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించిన సంగతిని కూడా గుర్తు చేసింది. ఫరీదుల్లా పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్తూ, విచారణకు తిరస్కరించింది. 


తనకు డిజిగ్నేటెడ్ కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ ఫరీదుల్లా చేసిన అపీలును 2013 మార్చి 21న సుప్రీంకోర్టు తిరస్కరించింది. జువెనైలిటీ (బాలుడు, మైనర్) విషయానికి వచ్చినపుడు, మిగతా చట్టాలపై టాడా చట్టానిదే ఆధిపత్యమని చెప్పింది. టాడా చట్టాన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం ఆమోదించారని తెలిపింది. 


1993 మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్ళు సంభవించిన సంగతి తెలిసిందే. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుట్రతో ఈ దారుణం జరిగింది. ఈ పేలుళ్ళ కారణంగా 257 మంది ప్రాణాలు కోల్పోగా, 713 మంది గాయపడ్డారు.


Updated Date - 2020-11-29T19:55:18+05:30 IST