ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు

ABN , First Publish Date - 2022-01-28T17:44:15+05:30 IST

షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ప్రభుత్వ

ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ : షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రిజర్వేషన్ల కోసం నిబంధనలను బలహీనపరచబోమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీని కోసం కొత్త కొలమానాన్ని విధించజాలమని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందా? అనే అంశంపై సమాచారాన్ని సేకరించవలసిన బాధ్యత రాష్ట్రాలదేనని తెలిపింది. జస్టిస్ నాగేశ్వర రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. 


ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో రిజర్వేషన్ల మంజూరుకు ముందు గణాంకాలతో కూడిన సమాచారాన్ని సేకరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు నేపథ్యంలో తాము కొత్తగా ఓ కొలమానాన్ని విధించడం సాధ్యం కాదని తెలిపింది. 


ప్రభుత్వోద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించవలసిన బాధ్యత రాష్ట్రాలదేనని తెలిపింది. రిజర్వేషన్లపై సమాచారాన్ని కేడర్ బేస్డ్ వేకెన్సీల ప్రాతిపదికపై సేకరించాలని చెప్పింది. రిజర్వేషన్ల కల్పన కోసం రాష్ట్రాలు సమీక్షను నిర్వహించాలని తెలిపింది. 


కేంద్ర ప్రభుత్వం అంతకుముందు వాదనలు వినిపిస్తూ, భారత దేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, ప్రతిభ విషయంలో అగ్ర వర్ణాల స్థాయికి ఎస్సీ, ఎస్టీలు రాలేదని తెలిపింది. 


ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్ల మంజూరుపై తీర్పును సుప్రీంకోర్టు అక్టోబరు 26న రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. 133 పిటిషన్లపై వాదనలను విన్న తర్వాత శుక్రవారం ఈ తీర్పును ఇచ్చింది. 


Updated Date - 2022-01-28T17:44:15+05:30 IST