పరిషత్ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: వర్లరామయ్య
ABN , First Publish Date - 2021-04-08T00:18:14+05:30 IST
పరిషత్ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ నేత వర్లరామయ్య ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: పరిషత్ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ నేత వర్లరామయ్య ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ బెంచ్ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. హైకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని అప్పీల్ చేస్తామని పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికలను నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే తాము ఎన్నికలను బహిష్కరించామని వర్లరామయ్య తెలిపారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కౌంటింగ్ జరపొద్దని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ జడ్జి వద్దకు వెళ్లి పిటిషన్ను పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది. దీంతో ఏప్రిల్ 8న యథావిధిగా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేని డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ కేసులో ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించగా, పిటిషనర్ వర్ల రామయ్య తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలను వినిపించారు.