సాగు చట్టాలపై మా నివేదికను బయటపెట్టరేం : సుప్రీంకోర్టు ప్యానెల్ మెంబర్

ABN , First Publish Date - 2021-09-07T23:20:05+05:30 IST

కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు అనిల్

సాగు చట్టాలపై మా నివేదికను బయటపెట్టరేం : సుప్రీంకోర్టు ప్యానెల్ మెంబర్

న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు అనిల్ జైసింగ్ ఘన్వత్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు ఓ లేఖ రాశారు. ఈ చట్టాలపై సంబంధితులందరితోనూ సంప్రదించి తాము రూపొందించిన నివేదికను బయటపెట్టాలని కోరారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించాలని, దీనిలోని సిఫారసులను అమలు చేయడం ద్వారా సాధ్యమైనంత త్వరగా రైతులకు సంతృప్తి కలిగే విధంగా ప్రతిష్టంభనకు శాంతియుత పరిష్కారం కోసం దోహదపడాలని కోరారు.  


2021 మార్చి 19న తాము సమర్పించిన నివేదికపై సుప్రీంకోర్టు దృష్టి సారించడం లేదని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. రైతుల భయాలన్నిటినీ దీనిలో చర్చించినట్లు తెలిపారు. రైతుల ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతుండటం తనకు చాలా బాధ కలిగిస్తోందని తెలిపారు. నివేదికను సమర్పించడానికి తమ కమిటీకి రెండు నెలల గడువు ఇచ్చారన్నారు. పెద్ద సంఖ్యలో రైతులను, ఈ చట్టాలతో సంబంధం ఉన్న ఇతరులను తాము సంప్రదించి, నిర్దిష్ట గడువుకు ముందే నివేదికను సమర్పించామన్నారు. రైతులకు గరిష్ఠ ప్రయోజనాలు కలగాలనే లక్ష్యంతో సంబంధితులందరి సలహాలు, అభిప్రాయాలను దీనిలో వివరించినట్లు తెలిపారు. 


సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ రైతు సంఘాలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. మార్కెటింగ్ కమిటీలను, 73 రైతు సంఘాలను సంప్రదించి, ఈ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించింది. 


Updated Date - 2021-09-07T23:20:05+05:30 IST