కోర్టు పరిపాలనా సంస్కరణలపై దృష్టి సారించిన CJI NV Ramana
ABN , First Publish Date - 2021-07-16T21:58:04+05:30 IST
కోర్టు పరిపాలనా సంస్కరణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దృష్టి సారించారు. ఖైదీల విడుదలలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: కోర్టు పరిపాలనా సంస్కరణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దృష్టి సారించారు. ఖైదీల విడుదలలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పులు, ఉత్తర్వులు, తక్షణం అధికారులు, కోర్టులు, జైళ్లకు చేరేలా ఫాస్టర్ పేరుతో కొత్త విధానం ప్రవేశపెట్టనున్నారు. బెయిల్ మంజూరు అయినా ఖైదీల విడుదల జాప్యంపై సుమోటోగా కేసు విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ సందర్భంగా సంస్కరణలపై కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పుల అమలులో జాప్యానికి ఫాస్టర్ విధానం మంగళం పాడనున్నది. తీర్పుల అమల్లో జాప్యానికి సాకులు చూపే ఆస్కారం లేకుండా ఫాస్టర్ విధానం తీసుకొచ్చారు. సురక్షితంగా, విశ్వసనీయంగా, తక్షణం ఆదేశాలు అందజేసే వ్యవస్థలా ఫాస్టర్ విధానాన్ని రూపొందించారు. 15 రోజుల్లోగా ప్రాజెక్ట్ నివేదిక సమర్పించాలని రిజిస్ట్రీని జస్టిస్ ఎన్వీరమణ, ఎల్.నాగేశ్వరరావు, బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఫాస్టర్ అమలుకు నెల రోజుల గడువును లక్ష్యంగా ధర్మాసనం పెట్టింది.