జడ్జీలు మానవీయ కోణాన్నీ చూడాలి
ABN , First Publish Date - 2022-08-02T08:48:19+05:30 IST
తీర్పులు చెప్పే సమయంలో జడ్జీలు మానవీయ కో ణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
వికలాంగ పింఛను ఇచ్చేలా నిబంధన మార్చండి
మద్యానికి బానిసైన జవాను కేసులో ‘సుప్రీం’ వ్యాఖ్య
న్యూఢిల్లీ, ఆగస్టు 1: తీర్పులు చెప్పే సమయంలో జడ్జీలు మానవీయ కో ణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మద్యానికి బానిసై ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన సైనికునికి వికలాంగ పింఛను కొనసాగించే విషయమై తగిన నిర్ణ యం తీసుకోవాలని కేంద్రానికి సూచిస్తూ ఈ వ్యాఖ్య చేసింది. కార్గిల్ యుద్ధంలో పోరాడిన నాగీందర్ సింగ్ అనే జవానుకు వికలాంగ పింఛను మంజూరు చేస్తూ ఆర్మ్డ్ ఫోర్స్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. అయితే మద్యానికి బానిస అయినందుకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారని, అందువల్ల వికలాంగ పింఛనుకు అర్హుడు కాడంటూ కేంద్రం అప్పీలు చేసింది. దీనిని జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ సుధాంశ్ ధులియాల ధర్మాససం విచారణ చేపట్టింది. అతడు కశ్మీర్లో పనిచేశాడని, అదెంత కష్టమైన ప్రాంతమో తమకు తెలుసునని పేర్కొంది. తామూ మనుషులమేనని,మానవీయ కోణంలో చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.