2007 hate speech case: యోగి ఆదిత్యనాథ్‌కు సుప్రీంలో భారీ ఊరట

ABN , First Publish Date - 2022-08-26T17:36:31+05:30 IST

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath

2007 hate speech case: యోగి ఆదిత్యనాథ్‌కు సుప్రీంలో భారీ ఊరట

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2007లో ఆయన విద్వేషపూరితంగా ప్రసంగించినట్లు నమోదైన కేసులో ఆయనను విచారించేందుకు ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది.  


యోగి ఆదిత్యనాథ్‌ను విచారించేందుకు అనుమతి మంజూరు చేయడానికి సంబంధించిన చట్టపరమైన ప్రశ్నలను పరిశీలించవలసిన అవసరం ఉన్నట్లు భావించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్‌వీ రమణ (NV Ramana), జస్టిస్ హిమ కొహ్లీ, జస్టిస్ సీటీ రవి కుమార్ ధర్మాసనం తెలిపింది. ఈ అపీలును తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. 


ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 2007 జనవరి 27న హిందూ యువ వాహిని సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ పర్వేజ్ పర్వాజ్ (Parvez Parwaz) ఆరోపించారు. ఆయనను విచారించేందుకు అనుమతిని తిరస్కరిస్తూ 2017 మే 3న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కేసును ముగిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పిటిషనర్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు 2018 ఫిబ్రవరి 22న  డిస్మిస్ చేసింది. అనంతరం ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 


Updated Date - 2022-08-26T17:36:31+05:30 IST