బిహార్లోని ముజఫర్ నగర్లో బాలికలపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని బిహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన బెంచ్ ఆధ్వర్యంలో జరిగిన విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఈ సూచన చేసింది. ముజఫర్ నగర్లో ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమంలో కొంతమంది బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. దీనిపై కోర్టు సూచనలతో ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించగా, 19 మంది దోషులుగా తేలింది. అయితే, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నిందితులపై చర్యలు తీసుకునేలా సీబీఐ సూచించినప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందనే దానిపై స్పష్టత లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది షోయెబ్ అలాం కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో, ఆ రిపోర్టు వెల్లడించేలా చూడాలని న్యాయవాది సుప్రీంకోర్టును కోరాడు. ఇప్పటికే ఘటన జరిగిన షెల్టర్ హోంతోపాటు మరిన్ని ఆశ్రమాలపై కూడా సీబీఐ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.