మల్లన్న సేవలో సుప్రీంకోర్టు సీజే

ABN , First Publish Date - 2021-06-19T08:20:12+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు శ్రీశైల మల్లన్నను, భ్రమరాంబదేవి అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు

మల్లన్న సేవలో సుప్రీంకోర్టు సీజే

స్వాగతం పలికిన మంత్రి వెలంపల్లి, ఎంపీ, ఎమ్మెల్యేలు 


శ్రీశైలం, జూన్‌ 18: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు శ్రీశైల మల్లన్నను, భ్రమరాంబదేవి అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా శ్రీశైలానికి వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణకు నందినికేతన్‌ అతిథి గృహం వద్ద ఘనస్వాగతం లభించింది. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైల ఆలయం చేరుకున్న సీజేఐ దంపతులకు రాజగోపురం వద్ద ఈవో కేఎస్‌ రామారావు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో మల్లికార్జునస్వామి, భ్రమరాంబదేవి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికను మంత్రి వెలంపల్లి అందజేసి శాలువాలతో సత్కరించారు.  ఆలయ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచిన పంచమఠాల జీర్ణోద్ధరణ పనుల్లో బయటపడిన తామ్రపత్ర శాసనాలను జస్టిస్‌ ఎన్వీ రమణ ఆసక్తిగా పరిశీలించారు. వాటి గురించి ఆర్కియాలజీ ఆఫ్‌ సర్వే ఇండియా మైసూర్‌ విభాగం డైరెక్టర్‌ మునిరత్నంరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రెండు గంటలపాటు శ్రీశైలంలో గడిపిన సీజేఐ అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరివెళ్లారు. ఆయన వెంట ఏపీ, తెలంగాణ హైకో ర్టు రిజిస్ట్రార్లు, న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వెంకటరమణ, జస్టిస్‌ వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. 

Updated Date - 2021-06-19T08:20:12+05:30 IST