యోగి ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-02-18T19:51:00+05:30 IST

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్

యోగి ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని నిరసనకారుల నుంచి వసూలు చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఆ సొమ్మును తిరిగి వారికి ఇచ్చేయాలని ఆదేశించింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా 2019లో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని భర్తీ చేయాలని నిరసనకారులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులిచ్చింది. 


రికవరీ నోటీసులను రద్దు చేయాలని కోరుతూ పర్వేజ్ అరిఫ్ టిటు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. చట్టవిరుద్ధంగా జారీ చేసిన నోటీసులను ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది. దీంతో 274 రికవరీ నోటీసులను ఉపసంహరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. 


సీఏఏ వ్యతిరేక నిరసనకారుల నుంచి వసూలు చేసిన మొత్తం సొమ్మును తిరిగి వారికి ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. నష్టపరిహారాన్ని రాబట్టేందుకు 2019 డిసెంబరులో చేపట్టిన చర్యలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని తెలిపింది. అయితే ఉత్తర ప్రదేశ్ రికవరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది. ఈ చట్టాన్ని 2020 ఆగస్టు 31న నోటిఫై చేశారు. 


Updated Date - 2022-02-18T19:51:00+05:30 IST