లఖింపూర్ ఖేరీ కేసు దర్యాప్తునకు న్యాయమూర్తి నియామకం
ABN , First Publish Date - 2021-11-17T19:15:53+05:30 IST
ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఇటీవల జరిగిన
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఇటీవల జరిగిన హింసాకాండపై దర్యాప్తును పర్యవేక్షించేందుకు జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్ను సుప్రీంకోర్టు నియమించింది. ఈ కేసు దర్యాప్తులో పారదర్శకత, నిజాయితీ ఉండేవిధంగా ఆయన పర్యవేక్షిస్తారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. జస్టిస్ రాకేశ్ జైన్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి, పదవీ విరమణ పొందారు.
లఖింపూర్ ఖేరీలో అక్టోబరు 3న ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనపై కొందరు రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. ఈ కేసు నిందితుల్లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా కూడా ఉన్నారు. అశిష్కు, మరో ఇద్దరికి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు బెయిలును మంగళవారం నిరాకరించింది.