కేంద్ర ప్రభుత్వంపై CJI Ramana తీవ్ర అసహనం.. సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-09-06T18:08:15+05:30 IST
గతంలో తాము రద్దు చేసిన చట్టం లాంటిదే.. మరొకటి చేయాల్సిన అవసరం ఏముందని
న్యూఢిల్లీ: ట్రైబ్యునళ్లపై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రైబ్యునళ్లపై కేంద్రం చేసిన కొత్త చట్టంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పులంటే కేంద్రానికి గౌరవం లేదన్నారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని అన్నారు. కేంద్రం చేసిన కొత్త చట్టం గతంలో తాము రద్దు చేసిన చట్టం లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా మరొకటి చేయాల్సిన అవసరం ఏముందని ఎన్వీ రమణ ప్రశ్నించారు.
కోర్టు ముందు మూడు దారులున్నాయని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ట్రైబ్యునళ్లను రద్దు చేయమంటారా?.. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలా?.. కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలా? అంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే ట్రైబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. ఈలోపు సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్వీ రమణ ఆదేశించారు.