రెండో విడత ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-05-18T05:16:56+05:30 IST

రాష్ట్రంలోని వివిధ కులవృత్తులను ప్రోత్సహించాలనే

రెండో విడత ఎప్పుడో?

  • అటకెక్కిన గొర్రెల పంపిణీ పథకం 
  • గొర్రెల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు 
  • రెండో విడతలో 21,037 యూనిట్లు లక్ష్యం
  • మొదటి విడతలో చాలామందికి పంపిణీ కాని గొర్రెలు 
  • పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు 


రాష్ట్రంలోని వివిధ కులవృత్తులను ప్రోత్సహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెలపంపిణీ పథకంపై నీలినీడలు అలుముకున్నాయి. గొర్రెల పంపిణీకి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇంతకూ ఈ పథకాన్ని కొనసాగిస్తారా? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


రంగారెడ్డి అర్బన్‌, మే 17 : కుల వృత్తుల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2017-18లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గొల్లకురుమల ఆర్థికాభివృద్ధికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని నాడు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హుజూరాబాద్‌ ఎన్నికల సమయంలో గొర్రెల పంపిణీపై హడావిడి చేసిన సర్కార్‌ తర్వాత దాని ఊసే ఎత్తడం లేదని గొర్రెలకాపరులు ఆరోపిస్తున్నారు. మొదటివిడతలో (2017-18) ఆర్థిక సంవత్సరంలో 20,927 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. 11,312 యూనిట్లు 75 శాతం సబ్సిడీతో పంపిణీ చేశారు. దీని కోసం రూ.125 కోట్లు ఖర్చు పెట్టారు. 9,615 యూనిట్లు పంపిణీ చేయలేదు. గొర్రెలకు బదులు గేదెలు ఇవ్వాలని లబ్ధిదారులు కలెక్టర్‌కు రాతపూర్వకంగా రాసిచ్చారు. రెండో విడతలో ఇవ్వాల్సిన గొర్రెలను జూలైలో ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 


చనిపోయిన స్థానంలో గొర్రెలు

మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెల్లో ఇప్పటివరకు 2,956 గొర్రెలు చనిపోగా వాటి స్థానంలో ఇన్సూరెన్స్‌ వారి ద్వారా విడుదలైన రూ. 1,56,08,800తో 2,709 గొర్రెలను పంపిణీ చేశారు. గొర్రెలకు దాణా కూడ పంపిణీ చేశారు. 


రెండో విడత లక్ష్యం 21,037 యూనిట్లు

జిల్లాలో గొర్రెలు పెంచేందుకు ఆసక్తిగల గొల్ల కురుమ కుటుంబాలను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి మొదటి విడతలోనే దరఖాస్తులు స్వీకరించారు. వారికి నూతన సంఘాలను రిజిస్ర్టేషన్‌ చేయించారు. అన్ని మండలాల్లో గ్రామసభలు జరిపి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరందరికీ విడతల వారీగా గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. తొలి విడత పంపిణీలో ఇంకా మిగిలిపోయిన వారంతా గొర్రెల కోసం ఎదురు చూస్తున్నారు. రెండో విడత లక్ష్యం 21,037 యూనిట్లు కాగా, ఇవి ఎప్పుడు పంపిణీ చేస్తారో ఇక వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఉండే వెటర్నరీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. జూలైలో రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 


పెరిగిన గొర్రె కాస్ట్‌...!

రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం 2017-18లో ప్రవేశ పెట్టింది. అప్పట్లో గొర్రెల కాస్ట్‌ తక్కువగా ఉండేది. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా నిత్యావసర ధరలతోపాటు గొర్రెలధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌లో గొర్రెల ధర పెరిగి పోవడంతో ఈ ఎఫెక్ట్‌ గొర్రెల పంపిణీ పథకంపై పడింది. లబ్ధిదారుల నుంచి డీడీలు  తీసుకునేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసే ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక విత్తన పొట్టేలు ఉంటుంది. అయితే.. ప్రభుత్వం ఒక గొర్రెకు రూ.5,200 చెల్లిస్తుంది. ఈ ధరకు ఇతర జిల్లాల్లో గొర్రె రావడం లేదు. అలాగే విత్తన పొట్టేలుకు రూ. 7 వేలు చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించే ఈ ధరకు విత్తన పొట్టేలు రావడం లేదు. ఈసారి రైతులు చెల్లించే 25 శాతం (రూ.31,250) పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.


గొర్రెలకు బదులు గేదెలు కావాలి

మొదటి విడతలో 20,927 యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 11,312 యూనిట్లను పంపిణీ చేశారు. మిగతా 9,615 యూనిట్లు పంపిణీ చేయలేదు. డీడీలు చెల్లించిన లబ్ధిదారులందరూ గొర్రెలు మాకొద్దంటూ జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. తిరిగి డీడీలను వాపస్‌ తీసుకున్నారు. అర్బన్‌ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులు గొర్రెలు తీసుకునేందుకు అయిష్టత చూపారు. గొర్రెలకు బదులుగా గేదెలను అందించాలని కలెక్టర్‌ను కోరారు. 


75 శాతం రాయితీపై..

గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం 75శాతం రాయితీపై గొర్రెలను అందిస్తోంది. ఒక్కో యూనిట్‌పై 20 గొర్రెలు, ఒక విత్తన పొట్టేలు ఉంటుంది. స్థానికంగా లభించే జీవాలు  కాకుండా ఇతర రాష్ర్టాలు, జిల్లాల్లో గొర్రెలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఒక యూనిట్‌ విలువ రూ.1.25 లక్షలు కాగా, అందులో ప్రభుత్వం యూనిట్‌కు 75శాతం (రూ.93,750) రాయితీ ఇస్తుండగా.. మిగతా 25శాతం (రూ.31,250) లబ్ధిదారులు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. గొర్రెల కొనుగోలుతోపాటు రవాణా చార్జీలు, బీమాకు అయ్యే ఖర్చులు ఇందులోనే ఉంటాయి. 


జూలైలో రెండో విడత పంపిణీ

జూలైలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ప్రస్తుతం రెండో విడతకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను కం ప్యూటర్‌లో పొందు పర్చు తున్నాము. డీడీలు చెల్లిం చిన వారందరికీ రెండో విడతలో గొర్రెల యూనిట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. మొదటి విడతలో లబ్ధిదారు లందరికీ గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది.

అంజలప్ప, జిల్లా పశువైద్యాధికారి


గొర్రెల పంపిణీ వివరాలు..

సొసైటీలు : 368

సభ్యులు : 41,964

మొదటి విడత లక్ష్యం : 20,927

పంపిణీ చేసిన యూనిట్లు : 11,312

ఖర్చు చేసింది : రూ.125 కోట్లు

రెండో విడత లక్ష్యం 21,037

పంపిణీ చేసింది : శూన్యం 

Updated Date - 2022-05-18T05:16:56+05:30 IST