పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-10-24T11:08:42+05:30 IST
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్రెడ్డి అన్నారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్రెడ్డి
మక్తల్ టౌన్, అక్టోబర్ 23 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా దయాకర్రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలకు పత్తి, కంది, ఆముదం, వరి పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంటలు దెబ్బతిని రైతులు అప్పుల ఊబిలో కూరుపోతుంటే, ప్రభుత్వం మాత్రం బతుకమ్మ చీరల పంపిణీ, ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇసుక దందాలో మునిగి తేలుతున్నారని, వారికి వారికి రైతుల గోడు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వర్షాలతో ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారికి కూడా ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ నర్సింగ్రావుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, మండల అధ్యక్షుడు సిద్ధార్థరెడ్డి, నాయకులు రవీందర్, అనిల్గౌడ్, బత్తెలయ్య, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.