బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరుగుతోంది

ABN , First Publish Date - 2020-04-05T23:54:06+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 2.80కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులకు ఉచితంగా 12 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమం సాఫీగా జరుగుతోందని పౌరసరఫరాల సంస్ధ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరుగుతోంది

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 2.80కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులకు ఉచితంగా 12 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమం సాఫీగా జరుగుతోందని పౌరసరఫరాల సంస్ధ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని, వాటిని వెంటనే పరిష్కరించినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ బాగుందని అన్నారు. ఆదివారం నగర మేయర్‌ బొంతురామ్మోహన్‌, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌తో కలిసి ముషీరాబాద్‌ నియోజకవర్గంలో పలు రేషన్‌షాపుల్లో బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 50శాతం మందికి రేషన్‌ బియ్యం పంపిణీ జరిగిందన్నారు. మొత్తం 87.55 లక్షల కుటుంబాలకు గాను 45.11 లక్షలకు పైగా కుటుంబాలకు 1.67 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసినట్టు తెలిపారు. కేవలం ఐదు రోజుల్లోనే ఇది సాధ్యమైందన్నారు. ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్‌లో పేదలు ఇబ్బంది పడకుండా తెల్లరేషన్‌ కార్డు కలిగిన వారి కుటుంబానికి 1500 రూపాయలు, ప్రతి ఒక్కరికీ 12 కేజీల బియ్యం అందిస్తున్నామన్నారు. 

Updated Date - 2020-04-05T23:54:06+05:30 IST