సన్ ‘ఫ్లవర్’ కాదు... ఫైర్
ABN , First Publish Date - 2022-04-05T18:20:44+05:30 IST
‘సన్ప్లవర్’ వంట నూనె ధరలు వంటింట్లో మంటలు రేపుతున్నాయి. పెరిగిన ధరలతో మధ్య తరగతి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం రష్యా,
- సామాన్యులకు చుక్కలు చూపుతున్న ‘సన్ఫ్లవర్’ నూనెల ధరలు
బళ్లారి(కర్ణాటక): ‘సన్ప్లవర్’ వంట నూనె ధరలు వంటింట్లో మంటలు రేపుతున్నాయి. పెరిగిన ధరలతో మధ్య తరగతి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్దమే కారణమని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఇండియాకు దిగుమతి అయ్యే నూనెల్లో సన్ప్లవన్ నూనె ముఖ్యమైనది. భీకర యుద్ధం కారణంగా దేశానికి రావాల్సిన ఆయిల్ దిగుమతి ఆగిపోయింది. దీంతో దేశంలో ఆయిల్ నిల్వలు తగ్గిపోయి ధరలు భారీగా పెరిగిపోయాయి. డిసెంబరు నెలలో లీటర్ రూ. 140 ఉన్న సన్ప్లవర్ నూనె ఇప్పుడు ఏకంగా రూ. 205కు చేరింది. నేటి ఆహారంలో సన్ప్లవర్ నూనె ప్రధానంగా మారింది. హొటళ్లు, డాబాలు, రెస్టొరెంట్లలో పామాయిల్ వంటలకు వాడుతుంటారు. అది కూడా లీటర్ రూ. 145 కు చేరింది. కొంతలో కొంత పామాయిల్ ధర తక్కువగా ఉన్నా పెద్దగా వాడేవారు తక్కువ అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక వేరుశనగ, తెళ్లు కుసుములు, నూనె అయితే లీటర్ ఏకంగా రూ. 350 వరకూ చేరింది. అయితే తెళ్లుకుసుములు, వేరుశనగర నూనె వంటలకు వాడే వారు చాలా చాలా తక్కువ. అయితే యుద్ధం పేరుతో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకుని ధరలను నియంత్రించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆకలి బాదలు తప్పవని వెల్లడిస్తున్నారు.