సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే సీతారామయ్య కన్నుమూత
ABN , First Publish Date - 2021-05-08T06:05:29+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పూర్వపు సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు బొగ్గారపు సీతారామయ్య (93) హైదరాబాద్ బంజారహిల్స్లోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం మృతిచెందారు.
ఖమ్మం, మే 7 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పూర్వపు సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు బొగ్గారపు సీతారామయ్య (93) హైదరాబాద్ బంజారహిల్స్లోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం మృతిచెందారు. గత రెండు నెలలుగా ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుజాతనగర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 1978లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరావుతో కలిసి న్యాయవాద విద్యను అభ్యసించారు. 1978లో సీపీఐ నుంచి పోటీ చేసిన పువ్వాడ నాగేశ్వర రావుపై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కలిసి న్యాయ విద్యను అభ్యసించిన ఇద్దరు రాజకీయాల్లో మాత్రం ప్రత్యర్థులుగా పోటీ చేశారు. 1983లో ఆయనకు టిక్కెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు దూరమయ్యారు. బొగ్గారపు మృతితో ఆయన స్వగ్రామ మైన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో విషాదం అలముకుంది. ఆయన మృతి పట్ల టీఆర్ఎస్ నాయకులు ఫత్తే అహ్మద్, కాంగ్రెస్ నాయకులు ఏపూరి చినరామలింగయ్య సంతాపం వ్యక్తం చేశారు.