వేలానికి సుజనా ఆస్తులు
ABN , First Publish Date - 2020-02-21T06:47:18+05:30 IST
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆస్తులను ఈ-ఆక్షన్ ద్వారా విక్రయించనున్నట్లు
- బకాయిల వసూలుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు
హైదరాబాద్, ఫిబ్రవరి 20: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆస్తులను ఈ-ఆక్షన్ ద్వారా విక్రయించనున్నట్లు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ప్రకటించింది. ఈ మేరకు బీవోఐ చెన్నై లార్జ్ కార్పొరేట్ శాఖ ఒక ప్రకటనను జారీ చేసింది. సుజనా యూనివర్సల్ నుంచి రూ.400 కోట్ల బకాయిలను రికవరీ చేసుకోవటంలో భాగంగా సర్ఫేసీ చట్టం కింద ఈ ఆస్తులను విక్రయిస్తున్నట్లు తెలిపింది. 2018 అక్టోబరు 26 నాటికి సుజనా యూనివర్సల్ రూ.322 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ప్రస్తుతం వడ్డీలు కలుపుకుంటే రుణ మొత్తం రూ.400 కోట్లకు చేరుకుందని బీవోఐ తెలిపింది. సుజనా యూనివర్సల్ తీసుకున్న రుణాలకు యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి), వై.జితిన్ కుమార్, వై.శివరామకృష్ణ, ఎస్టీ ప్రసాద్, జి.శ్రీనివాస రాజు, మెస్సర్స్ స్ల్పెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్, సుజనా క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, సుజనా పంప్స్ అండ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, నియోన్ టవర్స్ లిమిటెడ్, సార్క్ నెట్ లిమిటెడ్ గ్యారంటీర్లుగా వ్యవహరించారు.