నత్తనడకన సుజల స్రవంతి
ABN , First Publish Date - 2022-04-11T04:44:35+05:30 IST
జిల్లాలో మెట్ట ప్రాంతానిది ప్రత్యేక పరిస్థితి.. ఇక్కడ తిండి, ఉపాధి కొరతే కాదు.. చివరకు తాగునీటికీ కష్టాలు తప్పడం లేదు.
శుద్ధి జలం అందని ద్రాక్షానే..
ప్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో తీరని దాహార్తి
పనులు పూర్తయితే రూ.4కే 20 లీటర్ల నీరు
పట్టించుకోని అధికారులు
ఉదయగిరి రూరల్, ఏప్రిల్ 10 : జిల్లాలో మెట్ట ప్రాంతానిది ప్రత్యేక పరిస్థితి.. ఇక్కడ తిండి, ఉపాధి కొరతే కాదు.. చివరకు తాగునీటికీ కష్టాలు తప్పడం లేదు. ఏళ్ల తరబడి ఫ్లోరైడ్ సమస్యతో ఉదయగిరి నియోజకవర్గంలోని అనేక మండలాలు సతమతమవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని 2018లో అప్పటి టీడీ పీ ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రవేశపెట్టి ఫ్లోరై డ్ పీడిత గ్రామాల ప్రజలకు శుద్ధిజలం అందించాలని కంకణం క ట్టుకొంది. సుమారు 90 శాతం పనులు పూర్తి చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకానికి వైఎ్సఆర్ సుజల స్రవంతిగా పేరు మార్చింది. కొన్ని మండలాల్లో పథకం ప నులు పూర్తి చేసినా తాగునీటి సరఫరా చేయడం లేదు. మరికొన్ని మండలాల్లో ఇంకా పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. దీం తో శుద్ధిజలం అందని ద్రాక్షాలా మారింది. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజలకు దాహార్తి తీరడం లేదు. పనులు పూర్తయితే రూ.4కే 20 లీటర్ల నీరు అందుతోంది.
రూ.19.81 కోట్లతో..
ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలతోపాటు ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు, అనంతసాగరం మం డలాల్లో అన్ని పంచాయతీలకు శుద్ధిజలం అందించేందుకు సుమా రు రూ.19.81 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి మండలంలో మదర్ప్లాంట్ నిర్మించి బోర్లు సైతం ఏర్పాటు చేశారు. మం డలానికి ఒక మదర్ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి పంచాయతీలో ఏర్పాటు చేసిన మినీ ట్యాంకులకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసి ఆ నీటిని ప్రజలకు అందించేలా ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా మదర్ ప్లాంట్, పంచాయతీలో మినీ ట్యాంకుల ఏర్పాటు పనులు పూర్తవడంతోపాటు నీటిని సరఫరా చే సేందుకు ట్యాంకర్లు సైతం వచ్చాయి. కానీ అనంతసాగరం మండలంలో పనులు పూర్తయినా పథకం ప్రారంభించలేదు. కొండాపురం, దుత్తలూరు, సీతారామపురం, వరికుంటపాడు, వింజమూరు, కలిగిరి, మర్రిపాడు మండలాల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఉదయగిరి, జలదంకి మండలాల్లో పథకం ప్రారంభమైనా అన్ని పంచాయతీలకు నీటి సరఫరా చేయడంలేదు. ప్రధానంగా మేజర్ పంచాయతీ అయిన ఉదయగిరికి శుద్ధిజలం అందడం లేదు. పంచాయతీలో ఏర్పాటు చేసిన ఆర్డీ ట్యాంకులకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతోనే నీటి సరఫరా చేయడంలేదని అధికారులు చెపుతున్నారు.
రూ.4కే 20 లీటర్ల శుద్ధిజలం
ఈ పథకం పూర్తయితే రూ.4కే 20 లీటర్ల శుద్ధిజలం అందుతోంది. సాధారణంగా ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబంలో రోజుకు 40 లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. శుద్ధిజలం అందుబాటులో లేకపోవడంతో బయట 20 లీటర్లు రూ.10కు కొనుగోలు చేయాల్సి ఉంది. ఆ లెక్కన నెలకు రూ.600 తాగునీటికి ఖర్చు చేయాల్సి వస్తుందని పేద ప్రజలు వాపోతున్నా రు. వేసవి దృష్ట్యా నీటి వినియోగం అధికం కావడంతో ఖర్చు ఇంకా పెరిగే అవకాశముంది. సుజల స్రవంతి పథకం అందుబాటులోకి వస్తే రూ.4కే 20 లీటర్ల శుద్ధిజలం లభిస్తుండడంతో కొంతమేర ఖర్చు తగ్గుతుందని పలువురు భావిస్తున్నారు. 2021 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామన్న అధికారులు ఏడాది కావస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం. పథకం పనులు పూర్తి చేసి గరళం తాగుతున్న తమకు శుద్ధిజలం అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఫ్లోరైడ్ పీడిత ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
త్వరలో పూర్తి చేస్తాం
ఫ్లోరైడ్ పీడిత ప్రాం తాల ప్రజలకు శుద్ధిజలం అందించేందుకు ప్రారంభించిన వైఎ్సఆర్ సుజల స్రవంతి పథకం పనులు త్వరలో పూర్తి చేస్తాం. కొన్ని మండలాల్లో విద్యుత్, ఇతరత్రా పనులు చేపట్టాల్సి ఉంది. మిగిలిన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. వాటిని సైతం పూర్తి చేసి త్వరలో శుద్ధిజలాలు అందజేస్తాం.
- వెంకటేశ్వర్లు, ఇన్చార్జి ఆర్డబ్ల్యూఎస్ డీఈ