సీపీ కార్యాలయం ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-08-09T07:24:53+05:30 IST
తనపై రౌడీషీట్ తెరచి అంతుచూస్తానంటూ జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై చిరంజీవి, జడ్పీటీసీ బాదినేని..
కరీంనగర్ క్రైం, ఆగస్టు 8: తనపై రౌడీషీట్ తెరచి అంతుచూస్తానంటూ జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై చిరంజీవి, జడ్పీటీసీ బాదినేని రాజేందర్ వేధిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ బుగ్గారం మండలం గోపులపూర్కు చెందిన చిట్ల విజయ్కుమార్(27) శనివారం మధ్యాహ్నం సీపీ కార్యాలయం ఎదుట పురుగుల మందుతాగి ఆత్మహత్యయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు గమనించి విజయ్ను అడ్డుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం విజయ్కుమార్కు మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. గోపులపూర్కు చెందిన చిట్ల విజయ్కుమార్ కుటుంబానికి గ్రామంలో మూడున్నర ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో నుంచి అర ఎకరం వరకు దారికి ఉచితంగా వదిలిపెట్టాలని జడ్పీటీసీ ఒత్తిడి తీసుకువచ్చాడు. అంగీ కరించకపోవడంతో కుట్రతో తనతోపాటు తల్లి, సోదరుడు, బావ నలుగురిపై అక్రమంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నాడు. జగిత్యాల జిల్లా మంత్రిపై ఫేస్బుక్లో అభ్యంతకర పోస్టు చేశానని సైబర్క్రైం నమోదు చేశారని, దీనితో తనకు ఎలాంటి సంబంధంలేదని తెలిపాడు. ఎక్కడున్నా నిన్ను వదలనని అక్రమకేసులు బనాయించి ఎస్సై చిరంజీవి తన ఇంటికి కానిస్టేబుళ్లను పంపిస్తూ కుటుంబాన్ని నిత్యం వేధింపులకు, భయబ్రాంతులకు గురి చేస్తున్నాడన్నారు. 20 రోజులుగా తాము ఇంటికి వెళ్ళకుండా బయటే తిరుగుతున్నామని తెలిపాడు. ఎస్సై, జడ్పీటీసీల వేధింపులు, తప్పుడు కేసులపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు.
అడ్లూరి లక్ష్మణ్ పరామర్శ..
కాగా ఆత్మహత్యాయత్నం చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయ్కుమార్ను కాంగ్రెస్పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సై వేధింపులు, అక్రమ కేసులపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. విజయ్కుమార్పై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.