తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-15T06:00:31+05:30 IST
తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొడుపాక గ్రామం లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
పాపన్నపేట, మే 14: తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొడుపాక గ్రామం లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. ఎస్ఐ విజయ్నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... కొడుపాక గ్రామానికి చెందిన బుసనెల్లి గణేష్ (20) ఇంటి వద్దే ఖాళీగా ఉండటంతో తనతోపాటు గొర్రెలు మేపేందుకు రావాలని తండ్రి లక్ష్మయ్య సూచించాడు. ఎన్నిసార్లు చెప్పినా రాకపోయేసరికి శుక్రవారం మధ్యాహ్నం కుమారుడిని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన గణేష్ ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి తిరిగి రాలేదు. తండ్రి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. అయితే గ్రామ చెరువుకు వెళ్లే దారిలో పురుగుల మందు తాగిన గణేష్ నోటి నుంచి నురగలు రావడంతో అటుగా వెళ్లినవారు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వెంటనే ఆటోలో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.