ప్రేమ పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తున్నారు.. ఇంతలో ఏమైందో ఏమో..

ABN , First Publish Date - 2021-01-14T05:32:20+05:30 IST

ఇచ్ఛాపురం పట్టణంలోని రత్తకన్న దేవాంగుల వీధిలో..

ప్రేమ పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తున్నారు.. ఇంతలో ఏమైందో ఏమో..
ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న దంపతులు

క్షణికావేశంతో..

యువ దంపతుల ఆత్మహత్య

అనాథగా మిగిలిన చిన్నారి

పండుగ పూట విషాదం

రత్తకన్నలో ఘటన


ఇచ్ఛాపురం(శ్రీకాకుళం): ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు చిహ్నంగా ఏడాది కిందట కుమారుడు పుట్టాడు. అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. చిన్నారిని అనాథగా మిగిల్చారు. ఇచ్ఛాపురంలో జరిగింది ఈ విషాద ఘటన. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 


ఇచ్ఛాపురం పట్టణంలోని రత్తకన్న దేవాంగుల వీధిలో బొబ్బిలి చిరంజీవి (24), లతాశ్రీ (24) దంపతులు నివాసముంటున్నారు. వీరు కొన్నేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. 16 నెలల కిందట వీరికి కుమారుడు పుట్టాడు. బన్నీ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. చిరంజీవి రోజువారి కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆనందంగా వారి జీవితం గడిచిపోతున్న తరుణంలో మంగళవారం రాత్రి దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి తలుపులు తీసి చూడగా దూలానికి ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించారు. రత్తకన్న తోటవీధిలో చిరంజీవి తల్లిదండ్రులు, మంగళకాలనీలో లతాశ్రీ తల్లిదండ్రులు నివాసముంటున్నారు. స్థానికులు సమాచారమందించడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.


మృతదేహాలను చూసి గుండెలలిసేలా రోదించారు. పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. కాగా ఇటీవల దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయని.. క్షణికావేశంతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో రత్తకన్నలో విషాదం నెలకొంది. 




Updated Date - 2021-01-14T05:32:20+05:30 IST