పోలీస్స్టేషన్ భవనంపై నుంచి దూకి...
ABN , First Publish Date - 2022-08-09T05:38:56+05:30 IST
పోలీస్స్టేషన్ భవనంపై నుంచి దూకి...
దొంగతనం కేసులో అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న వ్యక్తికి గాయాలు
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
కరీమాబాద్, ఆగస్టు 8: వరంగల్లోని మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ భవనంపై నుంచి ఓ వ్యక్తి దూకి గాయాలపాలైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని అబ్బనికుంటకు చెందిన గంగరబోయిన శ్రీనివాస్, అతని సోదరి సాంబరి లక్ష్మికి చెందిన పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటి నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జూలై 31న పాత ఇంటిలో ఉన్న సామగ్రిని తరలించేందుకు కూలీలుగా లేబర్కాలనీ గరీబ్నగర్కు చెందిన శివరాత్రి కుమార్, జాన్పాకకు చెందిన కోమల్ల కుమార్, గూడురు మండలం పొనుగోడుకు చెందిన లునావత్ కిషన్, బానోత్ వీరులు వెళ్లారు. సామాన్లు తరలిస్తున్న సందర్భంలో లక్ష్మి పెట్టెలో దాచుకున్న తులంన్నర రెండు బంగారు గొలుసులు కనిపించకుండా పోయాయి. కూలీలే అపహరించారని భావించి లక్ష్మి సోదరుడు శ్రీనివాస్ ఆ కూలీలను పిలిచి నాలుగు రోజుల్లో ఇవ్వాలం టూ స్పష్టం చేశాడు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శ్రీనివాస్ ఆ నలుగురిపై ఈనెల 6న మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూలీలను విచారణ నిమిత్తం పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు.
ప్రధాన నిందితుడిగా భావిస్తున్న శివరాత్రి కుమార్ తోటి కూలీ కోమల్ల కు మార్తో చర్చిస్తూ.. జరిగిన దొంగతనంలో నువ్వు కూడా బాధ్యత వహించి బంగారు గొలుసులకు విలువ కట్టి లక్ష్మీకి ఇవ్వాలని దబాయించాడు. దీంతో చేయని తప్పుకు నేనెందుకు ఇస్తానంటూ కోమల్ల కుమార్ స్పష్టం చేశాడు. దీంతో కుమార్ బాధ్యత వహించకుంటే అంతుచూస్తానని బెది రించడంతో.. చేయని తప్పుకు నేరం మోపి.. బాధ్యత వహించమంటున్నా రని ఆందోళనకు గురై ఆదివారం మధ్యాహ్నం పోలీస్స్టేషన్ భవనంపై నుంచి దూకేసాడు. ఘటనలో కోమల్ల కుమార్కు గాయాలవడంతో పోలీసులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఎం జీఎం తరలించగా, మెరుగైన చికిత్స కోసం హన్మకొండలోని ఓ ప్రైవేటు హా స్పిటల్కు తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సీఐ శ్రీని వాస్ తెలిపారు.