అనుమానం పెనుభూతమై..

ABN , First Publish Date - 2021-04-23T06:37:03+05:30 IST

అనుమానం పెనుభూతమై రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ సంఘటన మంటాడలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.

అనుమానం పెనుభూతమై..
మృతుడి కుటుంబం (ఫైల్‌)

 భార్యపై పెట్రోల్‌ పోసి సజీవ దహనం

 ఉరేసుకుని భర్త  బలవన్మరణం

 అనాథలైన ఇద్దరు చిన్నారులు

మంటాడ (పమిడిముక్కల) ఏప్రిల్‌ 22 : అనుమానం పెనుభూతమై రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ సంఘటన మంటాడలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. కృష్ణాపురం ఎస్సీ కాలనీకి చెందిన చీలి మధుబాబుకు మంగళగిరికి చెందిన మాధవితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి చరణ్‌ (8), సంజయ్‌ (6)  పిల్లలున్నారు. చీలి మఽధుబాబు ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మధుబాబు (35)  బుధవారం అర్ధరాత్రి భార్య మాధవి (25)పై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు.  తలుపులు మూసి పక్కగదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొన్నాడు. ఇంటి నుంచి మంటలు వస్తున్నాయనే సమాచారంతో ఉయ్యూరు సీఐ సిహెచ్‌ నాగప్రసాదు, పమిడిముక్కల ఎస్సై సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మధుబాబు ఫ్యానుకు వేలాడుతూ మృతి చెంది ఉన్నాడు. కాలిన గాయాలతో ఉన్న మాధవిని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మాధవి మృతి చెందింది. అనుమానంతో మధుబాబు భార్యపై పెట్రో లు పోసి అంటించి ఉరివేసుకొన్నట్టు ఎస్సై సత్యనారాయణ  తెలిపారు. మృతదేహాలను బంధువులకు అప్పగించారు.  ఎస్సై సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-04-23T06:37:03+05:30 IST