కేంద్రం బంపర్ ఆఫర్! ఇలా చేస్తే 15 లక్షలు మీ సొంతం!

ABN , First Publish Date - 2021-07-28T22:17:55+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా దేశ ప్రజల కోసం ఓ కొత్త పోటీని ప్రకటించింది. దేశంలో మౌలికవసతుల అభివృద్ధికి ఏర్పాటు చేయబోతున్న డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కు(డీఎఫ్ఐ) పేరు, లోగో, ట్యాగ్‌లైన్ సూచించిన వారికి గరిష్ఠంగా రూ.15 లక్షల బహుమతి ఇస్తామని పేర్కొంది.

కేంద్రం బంపర్ ఆఫర్! ఇలా చేస్తే 15 లక్షలు మీ సొంతం!

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా దేశ ప్రజల కోసం ఓ కొత్త పోటీని ప్రకటించింది. దేశంలో మౌలికవసతుల అభివృద్ధికి ఏర్పాటు చేయబోతున్న డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కు(డీఎఫ్ఐ) పేరు, లోగో, ట్యాగ్‌లైన్ సూచించిన వారికి గరిష్ఠంగా రూ.15 లక్షల బహుమతి ఇస్తామని పేర్కొంది. ఈ పోటీలో పాల్గొనదలిచిన వారు ఆగస్టు 15 సాయంత్రం 5.30 లోపు తమ ఎంట్రీలను కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. ఒక్కో కేటగిరికి రూ. 5 లక్షల బహుమతిని ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలకు తగినట్టు డీఎఫ్ఐ పేరు, లోగో, ట్యాగ్‌లైన్‌ను ఒకే వ్యక్తి సూచించగలిగితే ఏకంగా రూ.15 లక్షల బహుమతిని గెలుచుకోవచ్చు. అంతేకాకుండా.. రెండో, మూడో బహుమతి పొందిన వారు రూ.3 లక్షలు, రూ.2 లక్షలు చొప్పున ప్రైజ్ మనీని పొందవచ్చు. కేంద్రం సూచనల ప్రకారం.. డీఎఫ్ఐ ఏర్పాటు వెనకున్న ఉద్దేశ్యాన్ని పేరు, లోగో, ట్యాగ్‌లైన్ ప్రతిఫలించాల్సి ఉంటుంది. సంస్థ లక్ష్యాలు ప్రజల మనసుల్లో నాటుకునేలా వీటిని డిజైన్ చేయాలి. సంస్థ పేరు పలికేందుకు సులువుగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూపకల్పన చేయాల్సి ఉంటుంది. https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution లింక్ ద్వారా ప్రజలు తమ ఎంట్రీలను పంపించవచ్చు.


డీఎఫ్ఐ అంటే..

దేశంలో మౌలికవసతుల అభివృద్ధికి నిధులు సమకూర్చేందుకు ఓ ఆర్థిక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఇందుకోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్-2021 పేరిట ఓ కొత్త చట్టాన్ని తెచ్చింది. ఈ బ్యాంకుకు కేంద్రం రూ. 111 లక్షల కోట్ల నిధులను కేటాయించింది. దేశంలో ప్రస్తుతం నిర్మిస్తున్న 7 వేల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా నిధులు సమకూర్చడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. కేంద్రం డీఎఫ్ఐని ఓ అభివృద్ధికారక బ్యాంకుగా అభివర్ణించింది. ‘‘ఇతర రుణదాతలను డీఎఫ్ఐ పక్కకు నెట్టదు. ఇందుకు బదులుగా అందరినీ కలుపుకుని ముందుకు వెళుతుంది. ఈ బ్యాంకు కేవలం రుణదాతగానే కాకుండా.. ప్రాజెక్టులకు ఇతర మార్గాల ద్వారా నిధులు సమకూరేందుకు ఓ అనుసంధాన కర్తగా కూడా వ్యవహరిస్తుంది’’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.  



Updated Date - 2021-07-28T22:17:55+05:30 IST