షార్ట్సర్క్యూట్తో చెరుకుపంట దగ్ధం
ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST
షార్ట్సర్క్యూట్తో చెరుకుపంట దగ్ధం
పెద్దేముల్, జనవరి21 (ఆంధ్రజ్యోతి): వేలాడుతున్న విద్యుత్ తీగలు ఒకదానినొకటి తగలడంతో షార్ట్సర్క్యూట్ ఏర్పడి చెరుకుపంట దగ్ధమైన ఘటన పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. దీంతో పది ఎకరాల్లో సాగుచేసిన చెరుకు పంటకు నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే.. బండమీదిపల్లి గ్రామానికి చెందిన పోచారం మల్లేశం, పోచారం రాములు ఇద్దరు అన్నదమ్ములు. వీరు చెరో ఐదెకరాల్లో చెరుకు పంట సాగు చేశారు. అయితే వీరి పంట పొలాల పక్కనుంచి ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతుండడంతో శుక్రవారం సాయంత్రం వీచిన గాలులకు ఒకదానికొకటి తాకి షార్ట్సర్క్యూట్ ఏర్పడింది. దీంతో నిప్పురవ్వలు చెరుకు పంటపై పడడంతో మంటలంటుకున్నాయి. గమనించిన రైతులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఈలోగా గ్రామస్థుల సహకారంతో మంటలార్పే ప్రయత్నం చేశారు. కానీ, పంట కోతదశలో ఉండటంతో ఎండిపోయిన ఆకులకు మంటలు అంటుకుని చేలు మొత్తం వ్యాపించాయి. ఫైర్సిబ్బంది వచ్చి మంటలార్పినా ఫలితం లేకపోయింది. 10 ఎకరాల్లో పంట కాలిపోయిందని, బాధిత రైతులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.