చెరకు రైతుకు లాభాల తీపి
ABN , First Publish Date - 2021-03-08T05:22:23+05:30 IST
నల్ల చెరకు రైతులకు లాభసాటిగా మారింది. ఖర్చులుపోను ఎకరాకు నికరంగా రూ.లక్ష ఆదాయం లభిస్తోంది. దీంతో మండలంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మండలంలోని గొర్రెపాడు, కూకట్లపల్లి రెండూ కలిసే ఉంటాయి. ఈ గ్రామాల్లో రెండు దశాబ్దాల నుంచి రైతులు నల్ల చెరకు సాగు చేస్తున్నారు. బోరు బావుల కింద నీటి వసతి ఉన్న పొలాల్లో వరికి ప్రత్యామ్నాయంగా చెరకును ఎంచుకున్న వారు ఏటా లాభాలను గడిస్తున్నారు. ఇప్పటి వరకు నష్టం అనేది రాలేదని వారు చెప్తున్నారు.
కూకట్లపల్లి, గొర్రెపాడుల్లో
200 ఎకరాల్లో సాగు
జోరుగా అమ్మకాలు
ఇతర రాష్ట్రాల
వ్యాపారుల కొనుగోలు
స్థానికంగానూ విక్రయం
ఎకరాకు రూ. లక్షపైన ఆదాయం
బల్లికురవ, మార్చి 7 : నల్ల చెరకు రైతులకు లాభసాటిగా మారింది. ఖర్చులుపోను ఎకరాకు నికరంగా రూ.లక్ష ఆదాయం లభిస్తోంది. దీంతో మండలంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మండలంలోని గొర్రెపాడు, కూకట్లపల్లి రెండూ కలిసే ఉంటాయి. ఈ గ్రామాల్లో రెండు దశాబ్దాల నుంచి రైతులు నల్ల చెరకు సాగు చేస్తున్నారు. బోరు బావుల కింద నీటి వసతి ఉన్న పొలాల్లో వరికి ప్రత్యామ్నాయంగా చెరకును ఎంచుకున్న వారు ఏటా లాభాలను గడిస్తున్నారు. ఇప్పటి వరకు నష్టం అనేది రాలేదని వారు చెప్తున్నారు. ఈ గ్రామాల్లో తొలుత కొద్ది విస్తీర్ణంలోనే చెరకు సాగు చేయగా, ఇప్పుడు అది 200 ఎకరాలకు చేరింది. ఎకరాకు 2 లక్షల వరకూ పెట్టుబడి అవుతుండగా, 25 వేల చెరకు గడల దిగుబడి వస్తోంది. గడ సరాసరి రూ. 15 చొప్పున హోల్సేల్గా అమ్ముకున్నా ఎకరాకి లక్ష ఆదాయం నికరంగా ఉంటుంది. ఇక్కడ చెరకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు కూడా వెళుతుందని రైతులు చెప్తున్నారు. ఎకరాల లెక్కన అమ్మకాలు చేస్తుంటామని, కొనుగోలు చేసిన వారు లారీలలో వాటిని తీసుకెళ్తుంటారని తెలిపారు. కొందరు రైతులు సమీపంలో జరిగే తిరునాళ్లకు తీసుకెళ్లి గడ రూ. 20 నుంచి రూ. 30 చొప్పున అమ్ముకుంటారు. వీరు మరింత లాభాలు గడిస్తున్నారు. రెండు గ్రామాలకు సమీపంలో ఉన్న అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్రీయ రహదారికి ఇరువైపులా నల్ల చెరకు విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. రోడ్డు వెంట వెళ్లే ప్రయాణికులు వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఇలా నల్ల చెరకు రైతులకు లాభాల తీపిని ఇస్తోంది.