‘సూది’ హత్యకు సూత్రధారి భార్యే

ABN , First Publish Date - 2022-09-22T08:12:55+05:30 IST

జమాల్‌సాహెబ్‌ హత్యకు ప్రధాన సూత్రధారి అతని భార్య షేక్‌ ఇమామ్‌బీనే అని పోలీసుల దర్యాప్తులో తేలింది.

‘సూది’ హత్యకు సూత్రధారి భార్యే

  • వివాహేతర సంబంధమే కారణం
  • రెండు నెలలుగా జమాల్‌ సాహెబ్‌ హత్యకు యత్నం
  • కేసును ఛేదించిన ఖమ్మం పోలీసులు
  • భార్య ఇమామ్‌బీ సహా ఆరుగురు నిందితుల అరెస్టు

ఖమ్మం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జమాల్‌సాహెబ్‌ హత్యకు ప్రధాన సూత్రధారి అతని భార్య షేక్‌ ఇమామ్‌బీనే అని పోలీసుల దర్యాప్తులో తేలింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని వెల్లడైంది. ఈ కేసులో ఖమ్మం రూరల్‌ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ బస్వారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన ఇమామ్‌బీ, అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ మోహన్‌రావు మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరు కలిసి ఉన్న సమయంలో జమాల్‌సాహెబ్‌ చూశాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన భర్తను చంపేయాలని ఇమామ్‌బీ  ప్రియుడు మోహన్‌రావును కోరింది. మోహన్‌ బండి వెంకన్న అనే ఆర్‌ఎంపీ వైద్యుడికి డబ్బులిచ్చి మత్తు మందు తెప్పించాడు. రెండు బాటిళ్లలో ఒకటి ఇమామ్‌బీకి ఇచ్చాడు. 


ఆ మత్తు మందుతో భర్తను చంపడానికి ఇమామ్‌బీ రెండు నెలలుగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కాలేదు. దీంతో జమాల్‌ను తానే చంపాలని మోహన్‌ నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇమామ్‌బీ జమాల్‌ జగ్గయ్యపేటలోని తన కూతురు దగ్గరికి వెళ్లింది. 19న జమాల్‌ కూడా జగ్గయ్య పేట వస్తున్నాడని మోహన్‌కు తెలియజేసింది. పథకం ప్రకారం మోహన్‌ తన మిత్రుడైన వెంకటేశ్‌, ఆర్‌ఎంపీ వైద్యుడు బండి వెంకన్నకు మత్తు మందు ఇచ్చి జమాల్‌కు ఇంజక్షన్‌ వేయాలని సూచించాడు. ఇద్దరూ ముదిగొండ మండలం బాణాపురం వద్ద కాపు కాశారు. బైక్‌లో పెట్రోల్‌ అయిపోయిందంటూ లిఫ్ట్‌ అడిగిన ఆర్‌ఎంపీ వెంకన్న జమాల్‌ తుంటికి మత్తు ఇంజక్షన్‌ వేశాడు. జమాల్‌ బండి ఆపడంతోనే దిగి వేరే బైక్‌ మీద వచ్చిన వెంకటేశ్‌తో కలిసి పరారయ్యాడు. ఈ కేసులో పోలీసులు నిందితుల నుంచి రెండు బైక్‌లు, ఆరు సెల్‌ఫోన్లు, వినియోగించని మత్తుమందు బాటిల్‌, ఉపయోగించిన ఇంజక్షన్‌ బాటిల్‌స్వాధీనం చేసుకున్నారు. కేసును రెండు రోజుల్లోనే ఛేదించిన ఖమ్మం రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, పోలీసు బృందాన్ని బస్వారెడ్డి అభినందించారు. ప్రైవేటు ఆసుపత్రులు మత్తు ఇంజక్షన్లు విక్రయించవద్దని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బస్వారెడ్డి విలేకరుల సమవేశంలో హెచ్చరించారు. దీనిపై జిల్లా వైద్యాధికారికి కూడా లేఖరాసినట్టు తెలిపారు. 

Updated Date - 2022-09-22T08:12:55+05:30 IST